పోలింగ్ వేళ, మరుసటి రోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై రాష్ట్ర హోంశాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హోంమంత్రి తానేటి వనిత డీజీపీ హరీష్ గుప్తాతో ఫోన్లో మాట్లాడారు. చంద్రగిరి, గురజాల తాడిపత్రి గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన హింసకాండ అంశాలపై డీజీపీతో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీకి ఓటు వేయలేదన్న కారణాలతో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలపై టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకుల దాడులను స్థానిక పోలీసుల దృష్టికి తీసుకొచ్చినా స్థానిక పోలీసులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు డీజీపీకి తెలిపారు. టీడీపీ దౌర్జన్యాలను హింసకాండను తక్షణమే అడ్డుకోవడంలో విఫలమైతే.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయన్నారు. దాడులకు పాల్పడ్డ నాయకులను, కార్యకర్తలను చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని ఆమె ఆదేశించారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కచ్చితంగా తెలియజేయాలని డీజీపీని కోరారు. రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ నియమించిన భద్రతా వ్యవహారాల పరిశీలకుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సమాచారం ఉన్నట్లు హోం మంత్రి తెలిపారు. ఎలక్షన్ పోలీస్ అబ్జర్వర్ తీరుతో రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నారు. టీడీపీ వారు ఇచ్చిన ఫిర్యాదులను అడ్డుపెట్టుకుని బాధ్యతలేకుండా ఎక్కడికక్కడ చేసిన బదిలీల వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని హోంమంత్రి వనిత డీజీపీకి వివరించారు. పట్టపగలు నడిరోడ్డుపై టీడీపీ కార్యకర్తలు నాయకులు హింసకు పాల్పడుతుంటే స్థానిక పోలీసులు పట్టనట్లు ఉన్నారని, వారంతా నిబంధనల ప్రకారం వ్యవహరించేలా తక్షణమే ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దౌర్జన్యకాండకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డీజీపీ హరీష్ గుప్తాను హోం మంత్రి తానేటి వనిత కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa