ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 81.86 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో దేశంలో ఇప్పటి వరకూ నాలుగు దశ పోలింగ్ జరగ్గా.. ఇప్పటి వరకూ నమోదైన అత్యధిక పోలింగ్ శాతం ఇదే కావడం గమనార్హం. పోలింగ్ శాతం పెరగడం తమకు కలిసి వస్తుందంటే.. తమకు కలిసొస్తుందని వైఎస్సార్సీపీ, టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల పోలింగ్ శాతాలను.. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ గెలిచిందా..? లేదా ప్రతిపక్షం గెలిచిందా? అనే విషయాలను ఓసారి పరిశీలిద్దాం.
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 77.96 శాతం పోలింగ్ నమోదైంది. ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో 79.64 శాతం పోలింగ్ నమోదైంది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఇది 1.68 శాతం ఎక్కువ. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొనగా.. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ 151 సీట్లతో ఘన విజయం సాధించింది.
ఉమ్మడి రాష్ట్రంలో ఇలా..
కొంత వెనక్కి వెళ్లి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. 1999 ఎన్నికల్లో 69.15 శాతం పోలింగ్ నమోదు కాగా.. టీడీపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే అంతకు ముందు 1994లో జరిగిన ఎన్నికల్లో 70.02 శాతం పోలింగ్ రికార్డయ్యింది. 1994 కంటే 1999లో పోలింగ్ శాతం కొద్దిగా తగ్గగా.. టీడీపీ అధికారాన్ని నిలుపుకొంది. 2004లో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగి 69.96 శాతంగా నమోదైంది. ఈసారి అధికార మార్పిడి జరిగింది. టీడీపీ ఓడిపోయి.. కాంగ్రెస్ అధికారంలోకి రాగా.. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు. 2009లో 72.7 శాతం పోలింగ్ నమోదైంది. రెండున్నర శాతానికిపైగా పోలింగ్ పెరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి వైఎస్ రెండోసారి సీఎం అయ్యారు. అయితే 2009లో ప్రజారాజ్యం కూడా పోటీలో ఉండటంతో త్రిముఖ పోరు జరిగింది. 2014 ఎన్నికల్లో పోలింగ్ 78 శాతం నమోదైంది. అయితే ఉమ్మడి ఏపీలో అవి చివరి ఎన్నికలు కావడంతోపాటు.. పోటీలో ఉన్న రెండు పార్టీలు కూడా అప్పుడు అధికారంలో లేవు. కొత్త రాష్ట్రం కావడంతో ఓటర్లు అనుభవం ఉన్న నేత వైపు మొగ్గు చూపారు.
అప్పుడు వైఎస్.. ఇప్పుడు జగన్..?
1994 నుంచి 2019 వరకు పోలింగ్ సరళిని విశ్లేషిస్తే.. 2009 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగినప్పటికీ వైఎస్ అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు జగన్ తిరిగి అధికారంలోకి వస్తే.. తండ్రికి మాదిరే పెరిగిన పోలింగ్ శాతం ఆయనకు ఉపకరిస్తుందని భావించొచ్చు. అయితే 2009లో చిరంజీవి కారణంగా త్రిముఖ పోరు ఉండగా.. ఈసారి ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన ప్రతిపక్ష ఓటును చీలనివ్వలేదు.
లోక్ సభ ఎన్నికల్లో ఇలా..
లోక్ సభ ఎన్నికల విషయానికి వస్తే.. 2009 లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే.. 2014లో 6.7 శాతం పోలింగ్ పెరిగింది. ఆ ఎన్నికల్లో యూపీఏ-2 ఓటమిపాలైంది. 2014 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 90 శాతం సీట్లను పోగొట్టుకుంది. 2014 లోక్ సభ ఎన్నికల్లో 65.95 శాతం పోలింగ్ నమోదు కాగా.. 2019 లోక్ సభ ఎన్నికల్లో 67.11 శాతం పోలింగ్ నమోదైంది. లోక్ సభ ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధికం. 2019 ఎన్నికల్లో 60 కోట్ల మందికిపైగా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే ఎన్డీయే అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. 1951 తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికలను పరిశీలిస్తే.. 9 ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎక్కువగా నమోదైంది. ఇందులో అధికార పార్టీ ఆరుసార్లు గెలవగా.. ప్రతిపక్షం మూడుసార్లు విజయం సాధించింది. పోలింగ్ శాతం తగ్గిన ఆరు సందర్భాల్లో అధికార పార్టీ మూడుసార్లు గెలిచి, మరో మూడు సార్లు ఓడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa