నైరుతి బంగాళాఖాతంలో మరో రెండు రోజుల్లో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం అల్పపీడనానికి అనువైన పరిస్థితులు నెలకున్నాయని అంచనా వేసింది. అయితే, ఇది తుఫానుగా మారే సూచనలపై కొద్ది రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పింది. అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ తీరంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆవర్తనం మొదట్లో ఈశాన్య దిశగా పయనించి మే 24 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు.
మే నెల తుఫాన్లు మాసంగా గుర్తింపు పొందినా.. ప్రస్తుతం ఏర్పడే అల్పపీడనం తుఫానుగా మారుతుందని ఐఎండీ ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత మాత్రమే తాము చాలా స్పష్టతతో చెప్పగలమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరంలో ఇది ఇంకా తొలి దశలోనే ఉంది కాబట్టి ఇది తుఫానుగా మారుతుందో లేదో నిర్ధారించడానికి చాలా తొందరపాటు అవుతుందని స్పష్టం చేసింది. అయితే, మే 20 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది.. ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని గతవారం ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పిన విషయం తెలిసిందే. ఇది ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్లో ప్రభావం చూపుతుందని అంచనా వేశారు.
మరోవైపు, మే 19న నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. సాధారణంగా మే 22 నాటికి రుతుపవనాలు అండమాన్ దీవుల్లో ప్రవేశిస్తాయి. కానీ, ఈ ఏడాది మూడు రోజుల ముందే రావడం శుభపరిణామం. ఇవి ప్రస్తుతం మాల్దీవులు, కోమరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించాయని ఐఎండీ పేర్కొంది. అన్నీ అనుకున్నట్టే జరిగితే మే 31 నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa