ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ 305 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుంది: అమెరికా పొలిటికల్ సైంటిస్ట్

national |  Suryaa Desk  | Published : Wed, May 22, 2024, 08:18 PM

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే 5 విడతల పోలింగ్ పూర్తి కాగా.. మరో రెండు దశల ఎన్నికలు మాత్రమే మిగిలి ఉన్నాయి. జూన్ 4 వ తేదీన ఫలితాలు వెల్లడికానుండగా.. ఎవరు విజేతలు అనేది తేలిపోనుంది. అయితే ఈ క్రమంలోనే రకరకాల ఊహాగానాలు, జోస్యాలు వస్తున్నాయి. ఇక గెలుపుపై అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి ధీమాగా ఉన్నాయి. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి విజయం సాధించి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని బీజేపీ నేతలు పదే పదే చెబుతుండగా.. ఈసారి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని.. ఇండియా కూటమి నేతలు పేర్కొంటున్నారు.


లోక్‌సభ ఎన్నికలు తుది దశకు వచ్చాయి. మరో రెండు విడతల్లో దేశంలోని 543 ఎంపీ స్థానాలకు ఎన్నికలు ముగియనున్నాయి. అయితే, ఈ సారి ఎన్నికల్లో మొత్తం అంకెల చుట్టూ తిరుగుతోంది. బీజేపీ స్వయంగా 370 సీట్లు, ఎన్డీయే కూటమి మొత్తంగా 400 కన్నా ఎక్కువ స్థానాలు గెలుస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఈ సారి బీజేపీ కేవలం 200 కన్నా తక్కువ స్థానాలకే పరిమితమవుతుంది, ఇండియా కూటమి 300 స్థానాలను కన్నా ఎక్కువ గెలుచుకుని అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.


2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 305 సీట్లు సాధిస్తుందని.. అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్, గ్లోబల్ పొలిటికల్ రిస్క్ కన్సల్టెంట్ ఇయాన్ బ్రెమ్మర్ మంగళవారం ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. 305 స్థానాలకు ఒక 10 సీట్లు అటూ.. ఇటుగా ఫలితాలు ఉంటాయని ఆయన అంచనా వేశారు. ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయాలు చూస్తే.. భారత్‌లో జరిగే ఎన్నికలు కాస్త స్థిరంగా కనిపిస్తాయని.. అమెరికా సహా మిగిలిన దేశాల్లో సమస్యాత్మకంగా ఉన్నాయని ఇయాన్ బ్రెమ్మర్ తెలిపారు.


ప్రస్తుతం భౌగోళిక రాజకీయాలు తీవ్ర అనిశ్చితిలో ఉన్నాయని.. గ్లోబలైజేషన్ భవిష్యత్.. కంపెనీలు కోరుకున్న విధంగా జరగడం లేదని ఇయాన్ బ్రెమ్మర్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలోకి రాజకీయాల ప్రవేశం.. ప్రపంచంలోని వివిధ దేశాల్లో జరుగుతున్న యుద్ధాలు.. అమెరికా-చైనా సంబంధాలు, అమెరికా ఎన్నికలు ఈ అనిశ్చితిలో భాగమే అని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సవాళ్లు.. తీవ్ర ప్రతీకూలంగా ఉన్నాయని.. ఇలాంటి సమయంలో కేవలం భారతదేశంలో జరిగే ఎన్నికలే కాస్త స్థిరంగా ఉన్నాయని.. మిగిలినవన్నీ సమస్యాత్మకంగా ఉన్నాయని పేర్కొన్నారు.


ప్రస్తుతం దేశంలో 7 విడతల్లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 295 నుంచి 315 సీట్లు వస్తాయని ఇయాన్ బ్రెమ్మర్ అంచనా వేశారు. ఇక ఈ ఏడాదిలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూడా ఎన్నికలు ఉన్నాయని.. అయితే అందులో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో అధికారం మారే పరిస్థితులు లేవని.. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమే తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని పేర్కొన్నారు. బలమైన ఆర్థిక పనితీరు.. స్థిరమైన సంస్కరణలతో నరేంద్ర మోదీ మూడోసారి గెలువబోతున్నారని తెలిపారు.


గత కొన్ని దశాబ్దాలుగా భారత్ పనితీరును పలు దేశాలు తక్కువగా చూశాయని.. కానీ ప్రస్తుతం ఉన్న అమెరికన్ కంపెనీల సీఈఓలు భారత్‌కు వస్తున్నారని చెప్పారు. భారత్‌లో అభివృద్ధి చూస్తున్నామని.. ప్రపంచంలోనే భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడాన్ని చూశామని.. 2028 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించ వచ్చని ఇయాన్ బ్రెమ్మర్ తెలిపారు. ప్రపంచ దేశాలతో కొనసాగించే సంబంధాల విషయంలో భారత్ శక్తివంతంగా మారడాన్ని ప్రపంచం చూస్తోందని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa