విజయనగరం జిల్లా, జియ్యమ్మవలస మండలం బిత్రపాడు గ్రామంలో సోమవారం కుక్కల దాడిలో ఓ వ్యక్తి మరణించాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నెల 11న వెంకటరాజపురంలో బంటు లక్ష్మి (70) కూడా కుక్కల దాడిలో మరణించిన విషయం తెలిసిందే. కాగా మండలంలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బిత్రపాడుకు చెందిన నీరస శంకరరావు (39) సోమవారం ఉదయం బహిర్భూమికి గ్రామ శివారు ప్రాంతానికి వెళ్లాడు. అయితే ఆయనపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. అపస్మారక స్థితికి చేరుకున్న శంకరరావును స్థానికులు హుటాహుటిన చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆయన్ని పరీక్షించిన వైద్యాధికారులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో భార్య , ఇద్దరు కుమార్తెలు భోరున విలపించారు. ఇంటి పెద్దదిక్కుని కోల్పోయిన తాము ఎలా బతకాలని వారు రోదించారు. ఇదిలాఉండగా ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలో అదే గ్రామానికి చెందిన సీర శంకరరావుపైనా కుక్కలు దాడి చేశాయి. అయితే అక్కడున్న గ్రామస్థులు శునకాలను తరిమి కొట్టడంతో అతడు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడగలిగాడు. కుక్కల దాడిలో ఇదే నెలలో మండలంలో ఇద్దరు మృతి చెందిన నేపథ్యంలో కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకొవాలని ఆ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa