ఏపీలో పింఛన్ తీసుకునే అవ్వాతాతలకు గుడ్ న్యూస్.. గత రెండు నెలలు పింఛన్ సొమ్ము ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసిన పింఛన్దారులకు ఈసారి ఆ ఇబ్బందులు తప్పాయి. జూన్ నెలలో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా పింఛన్ల పంపిణీ చేస్తామని, పింఛన్దారుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమచేస్తామని ఇటీవల ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా రెండురోజుల ముందుగానే పింఛన్ సొమ్మును విడుదల చేసింది. జూన్ నెలకు సంబంధించిన సామాజిక భద్రతా పింఛన్ల సొమ్మును విడుదల చేసింది. ఏపీలో మొత్తం.. 65,30,808 మంది పింఛన్దారులు ఉన్నారు. వీరికి పింఛన్ ఇచ్చేందుకు గానూ రూ.1,939.35 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వెల్లడించారు.
మరోవైపు ముందుగా చెప్పిన ప్రకారం.. జూన్ ఒకటో తేదీన నగదు బదిలీ ద్వారా 47,74,733 మంది పింఛన్దారుల బ్యాంకు ఖాతాలలో పింఛన్ జమ చేయనున్నారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న 17,56,105 మంది లబ్ధిదారులకు జూన్ ఒకటి నుంచి 5 వరకు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తారు.జూన్ ఆరో తేదీ వరకూ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున కోడ్ను అనుసరించి పింఛన్లు పంపిణీ చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ చేయవద్దని గతంలో ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ఏప్రిల్ నెల పింఛన్లను గ్రామ,వార్డు సచివాలయాల్లో పంపిణీ చేశారు. అయితే పింఛన్ సొమ్ము కోసం వచ్చి ఎండవేడిమికి తాళలేక పలువురు వృద్ధులు చనిపోవటంతో.. మే నెలలో పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. అలాగే వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, దివ్యాంగులకు ఇళ్లవద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఈసారి కూడా అదే పద్ధతిలో పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa