ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓటర్లు.. ఈ 3 ఓట్ల మధ్య తేడాలు ఏంటి?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 08:39 PM

దేశంలో రాజకీయ నాయకులను ఎన్నుకునేందుకు జనం ఓట్లు వేస్తారు. అయితే అందరూ వేసేది ఒకే రకమైన ఓట్లు కాదు. మన దేశంలో మొత్తం 3 రకాల ఓట్లు ఉంటాయి. 3 వర్గాల ఓటర్లు 3 రకాల ఓట్లను వేస్తారు. అందులో అతి ఎక్కువ మంది వేసే ఓట్లు ఈవీఎం పద్దతిలో వేస్తారు. ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, సర్వీస్ ఓట్లు అని వేరే ఉంటాయి. ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్, ఫలితాలు ఉన్న నేపథ్యంలో అసలు ఈ 3 రకాల ఓట్లు ఎవరెవరు వేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన వివరాల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 3 రకాల ఓటర్లున్నారు.


సాధారణ ఓటర్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ - ఈవీఎంల ద్వారా ఓట్లు వేస్తారు. ఇక ఎన్నికల విధులలో పాల్గొనే అధికారులు, భద్రతా సిబ్బంది, జర్నలిస్ట్‌లు.. పోస్టల్ బ్యాలెట్ పద్దతి ద్వారా ఓటు వేస్తారు. మరోవైపు.. సైన్యంలో పనిచేసేవారు సర్వీస్ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే ఈ 3 రకాల ఓటర్లు ఏ విధంగా తమ ఓటును వేస్తారు.. వాటిని ఎప్పుడు లెక్కిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా


పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు


ఎలక్షన్ కౌంటింగ్ రోజున మొట్టమొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన తర్వాతే మిగిలిన ఈవీఎంలలో నిక్షిప్తమైన పోలైన ఓట్లను లెక్కబెడతారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను ఉపయోగిస్తారు. ఎన్నికల పోలింగ్‌కు ముందే రిటర్నింగ్‌ అధికారులు.. ఈ పోస్టల్ బ్యాలెట్ పత్రాలను.. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి పంపిణీ చేస్తారు. వాటిలో ఉన్న బ్యాలెట్‌పై నచ్చిన అభ్యర్థిని ఎంచుకుని.. వివరాలను నమోదు చేసి.. ఎంపిక చేసిన కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సులలో వేస్తారు. కొంతమంది అధికారులు ఆ బ్యాలెట్‌ను తిరిగి రిటర్నింగ్‌ అధికారికి పోస్టు ద్వారా పంపిస్తారు.


సర్వీస్ ఓటర్లు


ఈ సర్వీస్ ఓటింగ్ ప్రక్రియను 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశ పెట్టింది. సైన్యంలో పని చేస్తున్న వారు సర్వీసు ఓటర్లుగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్‌ బ్యాలెట్‌ పద్దతి ద్వారా సైనికులకు ఈ ఓటు వేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పద్దతిలో ఓటును ఈ-మెయిల్‌ ద్వారా పంపిస్తారు. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు.. సర్వీస్ ఓటర్లు ఓటు వేసుకునేందుకు అవసరమైన దరఖాస్తు, బరిలో నిలిచిన అభ్యర్థుల పేర్లు, గుర్తుతో కూడిన ఈ-బ్యాలెట్‌ పేపర్‌ను.. ఈ-మెయిల్‌ ద్వారా పంపిస్తారు. సర్వీస్ ఓటును ఇతర ఓటర్లు వినియోగించుకోవడానికి వీలు లేకుండా బార్‌కోడ్‌, ఓటీపీ భద్రత ఉంటుంది.


ఈ-మెయిల్‌ ద్వారా వచ్చిన ఆ దరఖాస్తును ప్రింట్‌ తీసుకుని.. బ్యాలెట్‌ పేపరుపై ఉన్న అభ్యర్థుల్లో ఒకరిని ఆ సర్వీస్ ఓటర్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థి గుర్తుకు ఎదురుగా ఓటు వేసి.. ఆ బ్యాలెట్ పత్రాలను తిరిగి అదే రిటర్నింగ్‌ అధికారికి పోస్టు చేస్తారు. అయితే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి చాలా కొద్దిమొత్తంలో సర్వీస్ ఓట్లు ఉంటాయి. కొన్ని నియోజకవర్గాల్లో అసలే ఉండవు.


ఈవీఎం ఓటర్లు


ఇక సాధారణ ఓటర్లు వేసే ఓటింగ్ ప్రక్రియ గురించి మనకు తెలిసిందే. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి స్థానికంగా ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి.. నచ్చిన అభ్యర్థులకు ఈవీఎం ద్వారా ఓటు వేస్తారు.


ఒక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో దాదాపు 2500, లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 15 వేల వరకూ పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లు ఉంటాయి. పోస్టల్‌ బ్యాలెట్‌లన్నింటినీ ముందుగా ఒక గుట్టగా పోసి ప్రతి 25 పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను ఒక కట్టగా కడతారు. సాధారణంగా ఒక నిమిషానికి మూడు పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కించేందుకు అవకాశం ఉంటుంది. ఒక్కో కౌంటింగ్‌ టేబుల్‌కు ఒక రౌండ్‌కు గరిష్టంగా 20 కట్టలు అంటే 500 పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కింపు కోసం కేటాయిస్తారు.


పోస్టల్‌ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత కంట్రోల్‌ యూనిట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. కౌంటింగ్ కేంద్రంలో ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. తొలి రౌండ్‌లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది కాబట్టి ఈ రౌండ్ ఫలితం 40 నిమిషాల నుంచి గంట లోపు వస్తుంది. ఆ తర్వాత ప్రతి అర గంటకు ఓ రౌండ్ ఫలితం వస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa