ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రాత్రి ఏం జరిగింది? పోలీసుల ప్రశ్నకు టీనేజర్ షాకింగ్ ఆన్సర్

national |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2024, 09:46 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణే పోర్షే కారు ప్రమాదం కేసు ఊహించని మలుపులతో థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తోంది. ఈ కేసులో కొడుకు కాపాడేందుకు బడా కుటుంబం చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. కోర్టుల నుంచి వైద్యుల వరకూ అందర్నీ కొనేసి.. సాక్ష్యాలను తారుమారుచేసి తప్పుదొవ పట్టించే ప్రయత్నం చేశారు. కాగా, ఈ ప్రమాదం జరిగిన రోజున మద్యం తాగే కారును నడిపినట్లు పోలీసుల విచారణలో టీనేజర్ తాజాగా అంగీకరించాడు. అయితే, అధిక మోతాదులో మద్యం తీసుకుని కారును నడిపానని, తర్వాత ఏం జరిగిందో తనకు పూర్తిగా గుర్తులేదని చెప్పినట్టు పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి.


‘అవును.. నేను ఆ రోజు రాత్రి అధిక మోతాదులో మద్యం సేవించి వాహనం నడిపాను.. ఆపై పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఏం జరిగిందో నాకు పూర్తిగా గుర్తులేదు’ అని విచారణలో వెల్లడించినట్టు తెలిపాయి. ఇక సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు రక్త నమూనాలు మార్చేసిన టీనేజర్ తల్లిదండ్రులైన విశాల్‌ అగర్వాల్‌, శివానీ అగర్వాల్‌లకు జూన్ 5 వరకు పుణే కోర్టు పోలీసు కస్టడీ విధించింది. ఆల్కహాల్ ఉన్నట్టు నిరూపించేందుకు మైనర్ రక్త నమూనాలను సేకరించగా.. వాటి స్థానంలో అతడి తల్లి శాంపిల్స్‌ను మార్చినట్టు బయటపడింది.


అలాగే, ఈ కేసులో డ్రైవర్‌ను ఇరికించేందుకు ప్రయత్నించిన బాలుడి తాతతో పాటు టీనేజర్‌కు మద్యం సరఫరా చేసిన 2 పబ్‌ల యజమానులు, అక్కడి సిబ్బంది, బ్లడ్ శాంపిల్స్ మార్చేందుకు సహకరించిన ఇద్దరు డాక్టర్లు, ఓ ప్యూన్‌పై కూడా కేసు నమోదయ్యింది. వీరందర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తునకు 100 మంది పోలీసులతో కూడిన డజనుకు పైగా బృందాలను నియమించారు. దర్యాప్తును మరింత సమర్థంగా నిర్వహించి సాంకేతిక ఆధారాల సేకరణ, డాక్యుమెంటేషన్‌, క్షేత్రస్థాయి విచారణ కోసం బృందాలను ఏర్పాటు చేసి బాధ్యతలను అప్పగించామని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa