ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత తెలుగు తమ్ముళ్లు డీలా పడిపోయారు. అయితే చంద్రబాబు సారథ్యంలో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన తెలుగుదేశం పార్టీ.. జనసేన, బీజేపీలతో కలిసి మరోసారి అధికారంలో వచ్చింది. చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూసిన కార్యకర్తలు, అభిమానులు, నేతలు ఆనందంలో మునిగిపోతున్నారు. అలాగే ఇన్నిరోజులు తాము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని నేతల నుంచి కార్యకర్తల వరకూ ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళగిరిలోని టీడీపీ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్లకు గుడ్ న్యూస్ వినిపించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ను సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే బూత్ స్థాయి కార్యకర్తల నుంచి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల వరకూ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పదవులపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తానని ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పదవులు కట్టబెడతామని నేతలకు హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ విజయం కోసం ఎవరు పనిచేశారనే దానిపై వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. అలాగే మూతపడిన అన్నా క్యాంటీన్లను వందరోజుల్లోగా తెరుస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు టెలీకాన్ఫరెన్స్ సందర్భంగా టీడీపీ విజయం కోసం పార్టీ శ్రేణులు పడిన శ్రమను సీఎం చంద్రబాబు అభినందించారు. గడిచిన 20 ఏళ్లల్లో ఎన్నడూ గెలవని చోట్ల కూడా టీడీపీ గెలిచిందనీ.. దీనికి టీడీపీ శ్రేణులు పెట్టుకున్న నమ్మకమే కారణమన్నారు. ఎన్డీఏ కూటమి విజయానికి మూడు పార్టీల శ్రేణలుు కీలకంగా పనిచేశారని కొనియాడారు. ఇంతటి ఘన విజయానికి కారణమైన కార్యకర్తల రుణం తప్పకుండా తీర్చుకుంటానని సీఎం చంద్రబాబు అన్నారు.
ప్రజావేదికపై చంద్రబాబు కీలక నిర్ణయం
మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో కూల్చివేసిన ప్రజావేదికపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వినతులను స్వీరించేందుకు ప్రజావేదిక ఉంటే బాగుండేదన్న చంద్రబాబు.. జగన్ కూల్చేశారని మండిపడ్డారు. ప్రజా వేదిక శిథిలాలను తొలగించమని.. అలానే ఉంచుతామని స్పష్టం చేశారు. ప్రజా వేదిక శిథిలాలే జగన్ విధ్వంస పాలనకు ప్రతీకగా అభివర్ణించారు.
![]() |
![]() |