కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగిసిన తొలి వీకెండ్ కావటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. అలాగే సోమవారం కూడా సెలవురోజు కావటంతో వెంకన్న దర్శనానికి మరింత రద్దీ ఉండనుంది. శనివారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో తిరుమల గిరులు కిటకిటలాడాయి. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన షెడ్లలో సైతం భక్తులు కిక్కిరిసిపోయారు. మరోవైపు భక్తుల తాకిడి కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి.. సుమారు మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్ వ్యాపించింది. పాపవినాశనం వెళ్లే దారిలో ఉన్న కళ్యాణ వేదిక వరకూ భక్తులు బారులు తీరారు.
మరోవైపు భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. క్యూలైన్లలోకి తాగునీటిని అందిస్తున్నారు. అలాగే అన్న ప్రసాదం పంపిణీ కూడా శ్రీవారి సేవకుల ద్వారా క్యూలైన్ల వద్ద అందిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 28 నుంచి 30 గంటల వరకూ సమయం పడుతోంది. మరోవైపు సోమవారం కూడా ఇదే స్థాయిలో రద్దీ ఉండొచ్చని టీటీడీ అధికారులు చెప్తున్నారు. సోమవారం బక్రీద్ కారణంగా సెలవు రావటంతో భక్తులు మరింతగా తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గురువారం నుంచి కూడా యాత్రికుల తాకిడి తగ్గలేదని టీటీడీ వర్గాలు తెలిపాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ప్రత్యక్ష పర్యవేక్షణలో సీనియర్ అధికారులు , విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, టీటీడీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నప్రసాదం, తాగునీటిని ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
మరోవైపు శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కోసం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో ఎస్ఎస్డీ టైమ్ స్లాట్ టోకెన్లను టీటీడీ జారీ చేస్తుంది. అలాగే నడకదారి గుండా వెళ్లే భక్తుల కోసం 15 వేల టోకెన్స్ అందిస్తున్నారు. అలిపిరి గుండా వెళ్లేవారికి శ్రీభూదేవి కాంప్లెక్స్లో.. శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తున్నారు.
![]() |
![]() |