గుంతలు, గతుకులతో అధ్వాన్నంగా మారిన రహదారులను బాగుచేయాలని పలుసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా వారి నుంచి కనీస స్పందన కరువైంది. నిధుల్లేవని, ఏవో కుంటిసాకులతో సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వారి తీరుకు విసుగెత్తిపోయిన ప్రజలు.. తామే రోడ్లను బాగుచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తలో చేయి వేసి.. సొంతంగా మరమ్మతు చేసుకున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, టెకీలు.. స్వయంగా రంగంలోకి దిగి.. ప్రమాదకరంగా మారిన రహదారిలో గుంతులు పూడ్చిన ఈ ఘటన దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. వాహనాలతో రద్దీగా ఉండే కడుబీసనహళ్లి, వర్తూరు ప్రాంతంలో రోడ్లపై గుంతలు ఏర్పడటంతో దారుణంగా తయారయ్యాయి. ప్రమాదాలకు నిలయంగా మారిన రహదారులను శుభ్రం చేయాలని బెంగళూరు మహానగరపాలక సంస్థకు పలుసార్లు ఫిర్యాదు చేశారు. అయితే, నిధులు లేవనే కారణాలతో నగరపాలక సంస్థ అధికారులు చర్యలు తీసుకోలేదు. దీంతో తమ ప్రాంతంలో రోడ్లను బాగుచేసుకోవాలనే నిర్ణయానికి వచ్చిన స్థానికులు.. కమిటీగా ఏర్పడ్డారు. వీరిలో ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, స్థానికులు కూడా ఉన్నారు. వారంతంలో చేయిచేయి కలిపి రోడ్లను రిపేర్ చేసుకున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అధికారుల నిర్లక్ష్యంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ‘‘ఇది నిజంగా ఓ అద్భుతం. అధికారులు చేస్తారులే అని ఎదురుచూడకుండా నగరాన్ని శుభ్రం చేయడం చాలా గొప్ప విషయం’’ అని ఒకరు.. ‘‘ప్రతిఒక్కరూ ఇలాగే ఆలోచిస్తే.. ప్రమాదాలను కొంతైనా నివారించవచ్చు.. మీ అందరికీ సెల్యూట్. ’’ అని ఓ వ్యక్తి.. ‘‘బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తున్న అధికారులకు ఈ చర్య చెంపపెట్టు’ అని కామెంట్లు పెడుతున్నారు.
ఈ వీడియోపై కర్ణాటక ఉప-ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. ‘‘కొన్నిసార్లు ఇలాంటి చర్యలు మనకు ఎన్నో ఉత్తమ పాఠాలు నేర్పుతాయి.. బెంగళూరు వాసులు రహదారులను శుభ్రం చేయడం నా దృష్టికి వచ్చింది.. ప్రజల భద్రత మాకు ఎంతో ముఖ్యం. రహదారుల సమస్యపై తక్షణం చర్యలు తీసుకోవాలి.. ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించాను’’ అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa