బాపట్ల జిల్లా భట్టిప్రోలు పంచాయతీ అద్దేపల్లిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆదివారం పునఃప్రతిష్టించారు. ఇక్కడ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని టీడీపీ వర్గీయులు పెట్రోలు పోసి దహనం చేసిన విషయం విదితమే. ఈ చర్యను నిరసిస్తూ, ఆ స్థానంలో మరో విగ్రహం ఏర్పాటు చేయాలంటూ వైయస్ఆర్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్బాబు శనివారం రాత్రి మౌనదీక్షకు దిగారు. దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు గాయపడ్డారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు అశోక్బాబును రేపల్లె తరలించారు. ఆయన రాత్రి 12 గంటల వరకు రేపల్లె పోలీస్స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాను దీక్ష విరమించేది లేదని చెప్పడంతో బాపట్ల ఎస్పీ వకుల్జిందాల్ ఆదేశాల మేరకు అశోక్బాబును పోలీసులు బలవంతంగా చెరుకుపల్లిలోని ఆదిశంకర వ్యాలీలోగల ఆయన నివాసానికి రాత్రి ఒంటిగంట సమయంలో తరలించారు. అశోక్బాబు ఆదివారం కూడా తన నివాసంలో దీక్షను కొనసాగించారు. ఆదివారం ఉదయం ధ్వంసమైన వైయస్ఆర్ విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం మూడుగంటలకు దళితవాడ వాసులు పూలమాలలు వేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa