ప్రతి ఒక్కరూ వాళ్ల వాళ్ల స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి పెట్టుకుని ఉన్నారు అని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అయన మీడియాతో మాట్లాడుతూ.... చంద్రబాబు స్థాయిలో ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఇలా రెడ్ బుక్కులు పెట్టుకుని ఏం చేస్తున్నారు? అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తోంది. కానీ ఎవరూ మాట్లాడటం లేదు. దొంగ కేసులు పెడుతున్నారు. చీనీ చెట్లు నరికేస్తున్నారు. జేసీబీలు, ప్రొక్లెయిన్ల మీద స్వయంగా ఎమ్మెల్యేలు తిష్ట వేసి ఏకంగా పోయి బిల్డింగులు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంతటి దారుణంగా చేస్తున్నారంటే.. ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు.. రోజులు మీవే ఉండవు చంద్రబాబూ.. అది గుర్తు పెట్టుకో. మీ పాపాలు వేగంగా పండుతున్నాయి. ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితి వస్తుంది. కచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు, రోజులు కూడా ఉంటాయి. చేతనైతే ప్రజలకు మంచి చేయండి, ప్రజల మనసులు గెలుచుకుని చిరస్థాయిగా నిలబడేలా పాలన చేయండి. కానీ ఈ తప్పుడు రాజకీయాలు మానండి. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతున్నావు. నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. నువ్వు ఏదైతే విత్తుతావో అదే పండుతుంది. రేప్పొద్దున మళ్లీ మీ గ్రామాల్లో, మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితి, అటువంటి తప్పుడు సంప్రదాయాలు దయచేసి ఇప్పటికైనా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్లం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చేయాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం దుర్మార్గం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం కచ్చితంగా చెయ్యండి చంద్రబాబూ అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతుంటే మాత్రం ఎవరూ ఊరుకునేది జరగదు. రియాక్షన్ అనేది కచ్చితంగా ఉంటుంది అని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa