వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపోతు మురళీకృష్ణ అలియాస్ కొండపల్లి బుజ్జిపై విజయవాడలో టీడీపీ నేతలు హత్యాయత్నం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావుకు మద్దతుగా పనిచేశాడనే అక్కసుతో ఆయనపై హత్యాయత్నం చేశారు. విజయవాడ నగరం నడిబొడ్డున నార్త్జోన్ ఏసీపీ కార్యాలయానికి సమీపంలోనే ఈ దారుణానికి ఒడిగట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హత్యాయత్నం చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫార్మా డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్న మురళీకృష్ణ అలియాస్ బుజ్జి అయోధ్యనగర్ లోటస్ ల్యాండ్ సెక్టార్–1లో నివసిస్తున్నారు. రోజూలానే సోమవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో బ్యాడ్మింటన్ ఆడుకుని ఇంటికి వస్తుండగా సెక్టార్–2 ఆకాష్ అపార్ట్మెంట్స్ వద్దకు వచ్చేసరికి నలుగురు వ్యక్తులు రెండు బైకులపై వచ్చి ఆయన్ని అడ్డగించి ఒక్కసారిగా దాడిచేశారు. మోహంమీద, శరీరంపైన పిడుగుద్దులతో విరుచుకుపడ్డారు. పక్కనున్న రాయితో కొట్టి హత్యచేసేందుకు ప్రయత్నించారు. చుట్టుపక్కలవారు కేకలు వేయడంతో అక్కడినుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన బుజ్జిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు.. హత్యాయత్నం చేసింది టీడీపీకి చెందిన కాకొల్లు మహేంద్ర, గొట్టుముక్కల వెంకటేశ్వరరాజు, బెజ్జం జయపాల్, షేక్ గౌస్బాషాగా గుర్తించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితుల్ని కోర్టులో హాజరుపరిచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa