విద్యుత్ సరఫరాలో తరచూ జరుగుతున్న అంతరాయాలు, సరఫరాల నిలిపివేతలు లేకుండా మెరుగైన విద్యుత్ అందించాలని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం పోరంకి టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ, రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఎటువంటి విద్యుత్ అంతరాయాలు లేకుండా చూడాలని, కానూరు, ఉయ్యూరు 133-33కేవీ సబ్స్టేషన్లు నిర్మించడానికి అంచనాలు తయారు చేసి వెంటనే వాటిని ఏర్పాటు చేయడానికి కృషి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పెనమలూరు మండలంలో ప్రభునగర్, పెదపులిపాక, యనమలకుదురు, తాడిగడప, వందడుగుల రోడ్డు, ఉయ్యూరు మార్కెట్ యార్డుల్లో సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు సరఫరా చేసే విద్యుత్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లలో లోవోల్టేజి, అంతరాయాలు లేకుండా చూడాలని కోరారు. సోలార్ విద్యుత్ సేవలపై అధికారులను ప్రత్యేకంగా ఆరా తీశారు. పీఎం సూర్యఘర్ స్కీం క్రింద రావాల్సిన సబ్సిడీల గురించి గ్రామగ్రామాన అవగాహన కల్పించి సోలార్ విద్యుత్ కనెక్షన్ల వినియోగం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. విద్యుత్ సిబ్బంది అందరినీ హెడ్ క్వార్టర్లలో నివాసం ఉండి ప్రజలకు తక్షణమే అందుబాటులో ఉండాలని కోరారు. ఉయ్యూరు ప్రాంతంలో తరచూ జరుగుతున్న విద్యుత్ సరఫరాలో అంతరాయాల గురించి అసహనం వ్యక్తం చేశారు. పెద ఓగిరాల పుల్లేరు కట్ట వద్ద ఆక్రమణలకు విద్యుత్ కనెక్షన్లను ఇవ్వడంపై ఆ ప్రాంత ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేసి రిపీట్ అయిన పక్షంలో తగు చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఉయ్యూరు, కంకిపాడు ప్రాంతాల్లో గతంలో విద్యుదాఘాతాలకు గురై మృతి చెందిన విషయాలను గుర్తు చేసి అవి మళ్లీ జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు అనుమోలు ప్రభాకరరావు, గుణదల విద్యుత్ శాఖ ఈఈ హరిబాబు, ఉయ్యూరు ఈఈ కృష్ణనాయక్, టెక్నికల్ ఈఈ ఉప్పలపాటి హనుమయ్య, కానూరు డీఈఈ బోడేపూడి నవీన్కుమార్, ఉయ్యూరు డీఈఈ రామకృష్ణ, ట్రాన్స్కో డీఈఈ శ్రీనివాసరావు, వివిధ ప్రాంతాల ఏఈలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa