ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. నిన్న సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లారు. రాత్రి కేంద్ర హోమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇక ఇవాళ ఉదయం సీఎం అధికారిక నివాసం(1, జన్పథ్)లో పూజలు నిర్వహించారు. అనంతరం విజయవాడకు చంద్రబాబు తిరుగు ప్రయాణమయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి అమిత్ షాకు చంద్రబాబు వివరించారు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురైందని వెల్లడించారు. అస్తవ్యస్థ నిర్వహణ, అవినీతి కారణంగా ఏపీ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని చంద్రబాబు తెలిపారు. 2019-24 ఆర్థిక సంవత్సరాల మధ్య మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదుపు తప్పి, అస్థిరమైన అప్పులను వివరిస్తూ విడుదల చేసిన నాలుగు శ్వేతపత్రాలను అమిత్ షాకు వివరించానని చంద్రబాబు తెలిపారు. ప్రజలు ఏపీలో ఎన్డీఏకు అనుకూలంగా తీర్పునిచ్చారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని గాడిలో పెడతాయని చంద్రబాబు ట్వీట్ చేశారు. పర్యటనలో సీఎంతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రులు కే. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కేశినేని చిన్ని తదితరులు ఉన్నారు. కాగా.. జన్పథ్ నివాసంలో చంద్రబాబును బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కలిశారు. అనంతరం చంద్రబాబు తన పర్యటన ముగించుకుని విజయవాడకు బయలుదేరారు. అయితే చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను సైతం కలుస్తారంటూ వార్తలు వచ్చాయి. నిర్మలతో భేటీ ఏమీ లేదని అధికారులు వెల్లడించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన కేవలం కొన్ని గంటలు మాత్రమే సాగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa