ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో 14 ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేస్తాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2024, 08:19 PM

ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన సేవలపై పౌర విమానయాన శాఖ దృష్టిసారించింది. రాష్ట్రానికి మరిన్ని ఎయిర్ పోర్టులు తీసుకొస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. కేంద్రమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో  సమావేశం అయ్యారు. కార్యాలయానికి చంద్రబాబును సాదరంగా ఆహ్వానించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన రంగం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఏపీలో విమానయాన రంగ అభివృద్ధి పై విమానయాన శాఖ అధికారులతో చంద్రబాబు, రామ్మోహన్ నాయుడు సుధీర్గంగా సమీక్ష నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటలపాటు ఆ సమావేశం జరిగింది.  సందర్భంగా అయన మాట్లాడుతూ.... ‘ఆంధ్రప్రదేశ్‌లో నూతన ఎయిర్ పోర్టుల నిర్మాణం గురించి అధికారులతో చర్చించాం. ఎయిర్ పోర్టుల అభివృద్ధి, హెలికాప్టర్, డ్రోన్ సేవలు, సి ప్లెయిన్, విమాన సేవల పెంపు అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. విమానయాన రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన రంగానికి సంబంధించి కీలక అంశాలపై సీఎం చంద్రబాబుతో చర్చించా. ఏపీలో 14 ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేస్తాం. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం చంద్రబాబు. కృతజ్ఞతలు తెలియజేస్తూ నా కార్యాలయానికి ఆహ్వానించా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏడు విమానాశ్రయాల్లో కార్యకలాపాలు జరుగుతున్నాయి. విశాఖపట్టణం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, కడప విమానాశ్రయాల్లో రాకపోకలు సాగుతున్నాయి. టెర్మినల్ భవనాల విషయంలో అవసరాల మేర ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చించాం. కొత్త విమానాశ్రయాల ఏర్పాటు గురించి మాట్లాడాను. రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తే విమానయాన శాఖ తరపు నుంచి వెంటనే చర్యలు చేపడతాం అని’ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa