అన్నదాతలకు సాగులో తోడ్పాటు అందించే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే కరవు పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రాయలసీమ రైతులకు ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది. రాయలసీమ జిల్లాలలో సాగును ప్రోత్సహించేలా వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీపి కబురు చెప్పారు. రాయలసీమ జిల్లాలో సాగును ప్రోత్సహించేందుకు గానూ.. 80 శాతం రాయితీతో విత్తనాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రాయలసీమ జిల్లాల వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ జిల్లాల్లో సాగు విస్తీర్ణం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్బంగా రాయలసీమలో ప్రస్తుతం 11లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.రాయలసీమ జిల్లాలలో సుమారుగా 15 లక్షల హెక్టార్ల సాగుభూమి ఉంటే అందులో మూడున్నర లక్షల హెక్టార్ల సాగుభూమిలో ప్రస్తుతం ఎలాంటి పంటలు సాగుచేయడం లేదని అచ్చెన్నాయుడికి వివరించారు. ఆ భూముల్లో ప్రత్యామ్నాయ పంటలుగా ఉలవలు, అలసందలు, కొర్రలు, పెసర, మినుములు, సజ్జ పంటలను సూచించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో సాగు విస్తీర్ణం పెంచేందుకు గానూ.. రాయలసీమ జిల్లాల్లో రైతులకు 80 శాతం సబ్సిడీపై విత్తనాలను అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క రైతుకు ఆదాయం తగ్గకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
మరోవైపు రైతులు కోరుకునే విత్తనాలను వారికి అందించాలని.. అలాంటి వాటికి రాయితీ కూడా కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ప్రత్యామ్నాయ పంటల సాగుపై అన్నదాతలకు అవగాహన కల్పించాలని తగు సూచనలు చేయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు 80 శాతం విత్తన రాయితీకి సంబంధించి టెండర్లు చివరి దశలో ఉన్నాయన్న అధికారులు.. ఒకట్రెండు రోజుల్లో సరఫరా ఏజెన్సీలను నియమిస్తామన్నారు. ఆ తర్వాత విత్తన పంపిణీ చేస్తామని విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ శివప్రసాద్ మంత్రికి తెలియజేశారు. దీంతో త్వరలోనే రాయలసీమ రైతులకు 80 శాతం రాయితీతో విత్తనాలు అందనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa