ఏపీ సరిహద్దులో గాలి జనార్ధనరెడ్డి కంపెనీకి మైనింగ్ అనుమతి ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదంటూ జగన్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించాలనుకుంటున్నామని మంగళవారం సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అమికస్ క్యూరీ నివేదికను కూడా అధ్యయనం చేసి మరో అఫిడవిట్ దాఖలు చేస్తామని పేర్కొంది. ఈ అభ్యర్థనపై తదుపరి విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఓబుళాపురం మైనింగ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ తవ్వకాల్లో రాష్ట్ర సరిహద్దులు చేరిగిపోవడంతో గతంలో చేపట్టిన తవ్వకాలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులు గుర్తిస్తూ 2018లో సర్వే ఆఫ్ ఇండియా నివేదికలు సమర్పించింది. సర్వే ఆఫ్ ఇండియా దాఖలు చేసిన నివేదికపై అధ్యయనానికి నియమించిన అమికస్ క్యూరీ మరో నివేదికను సమర్పించింది. అయితే అమికస్ క్యూరీ నివేదికపై అధ్యయనం చేయాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్దార్థ లూత్రా న్యాయస్థానికి తెలిపారు. తమకు కూడా కొంత సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు. ఇక 2009 నుంచి తమకు కేటాయించిన ప్రాంతంలో మైనింగ్ జరపడం లేదని, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నట్లు గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ కంపెనీల తరపు న్యాయవాదులు చెప్పారు. సర్వే ఆఫ్ ఇండియా నివేదికకు అనుగుణంగా గాలి జనార్ధనరెడ్డి కంపెనీకి మైనింగ్కి ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని గతంలో జగన్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని మైనింగ్ కంపెనీల న్యాయవాదులు తెలిపారు. అందరి వాదనలు పరిగణనలోకి తీసుకున్న అనంతరం కేసు విచారణ నాలుగు వారాల పాటు జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నేతృత్వంలోని ధర్మాసనం వాయిదా వేసింది. అమికస్ క్యూరీ నివేదికపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa