భీమిలి డైట్ (డిస్ర్టిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్)లో రెండేళ్ల నుంచి నిర్వహిస్తున్న విద్యా సమాఖ్య కేంద్రాన్ని (కమాండ్ కంట్రోల్ సెంటర్) మూసివేయాల్సిందిగా పాఠశాల విద్యా శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. అక్కడ పనిచేస్తున్న 30 మంది టీచర్లను గతంలో పనిచేసిన పాఠశాలలకు పంపించేశారు. వైసీపీ ప్రభుత్వం 2022 నవంబరులో భీమిలిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుచేసి, అందులో పనిచేసేందుకు పలు జిల్లాల నుంచి 30 మంది టీచర్లను డిప్యూటేషన్పై నియమించింది. వారు ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయిలో పాఠశాల విద్యా శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలు, పాఠశాలలను పర్యవేక్షించాలని సూచించింది. ఒక్కొక్కరికీ ఒక్కో జిల్లా అప్పగించింది. పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేసిన తరువాత అప్లోడ్ చేసే ఫొటోలు, మధ్యాహ్న భోజనం ఫొటోలు, టీచర్ల అటెండెన్స్, ఇతరత్రా కార్యక్రమాలు అమలు తీరును ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని ఆదేశించింది. అయితే కమాండ్ కంట్రోల్ సెంటర్లో 30 మందికి సరిపడా పని లేకపోయినా ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న వ్యక్తుల ద్వారా పలువురు టీచర్లు డిప్యూటేషన్ వేయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పనిచేయాల్సిన ఉపాధ్యాయులు విశాఖలో ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెంటర్లో పోస్టింగ్ తెచ్చుకున్నారు. అలాగే నగర శివారులోని ఒక పాఠశాలలో ఒక టీచరు ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్నారు. గత ఏడాది బదిలీల్లో సదరు టీచరు ఏజెన్సీకి బదిలీ కావల్సి ఉంది. బదిలీ తప్పించుకునేందుకు డిప్యూటేషన్పై కమాండ్ కంట్రోల్ రూమ్కు వెళ్లారు. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరుపై చాలాకాలంగా ఫిర్యాదులు వచ్చినా విద్యా శాఖ అధికారులు పట్టించుకోలేదని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తుండేవి. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో గత పాలకులకు అస్మదీయులైన టీచర్లతో నిండిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను రెండు రోజుల క్రితం మూసివేశారు. అక్కడ పనిచేసే టీచర్లు సంబంధిత పాఠశాలల్లో చేరారని డీఈవో చంద్రకళ తెలిపారు. త్వరలో మినీ కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం మాదిరిగా మినీ సెంటర్లలో టీచర్లను కాకుండా బోధనేతర సిబ్బందిని నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa