భారీ వర్షాలు, వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో మరి కొన్ని గంటల్లో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడనుందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురవనున్నాయి. అయితే దీని ప్రభావం పశ్చిమబెంగాల్, బిహార్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీ మీద అల్పపీడనం ప్రభావం అంతగా లేకపోయినా.. వచ్చే మూడు రోజులు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
దీని ఆంధ్రప్రదేశ్లో శనివారం (సెప్టెంబర్ 14) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శుక్రవారం కూడా పలు జిల్లాలలో వర్షం కురిసిందని తెలిపింది. మరోవైపు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఏపీ అతలాకుతలం అయ్యింది. విజయవాడ సహా కొన్ని జిల్లాలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఇళ్లల్లోకి వరదనీరు చేరి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. విజయవాడ వరదల్లో పదుల సంఖ్యలో జనం చనిపోయారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. వాహనాలు దెబ్బతిన్నాయి. ఇళ్లల్లోకి బురద నీరు చేరి.. పునరావాస కేంద్రాలకే పరిమితమైన పరిస్థితి. ఈ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మరోసారి వానలు కురుస్తాయన్న వార్తలు ఏపీవాసులను కలవరపెడుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు భారీ వర్ష సూచన లేకపోవటంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.
మరోవైపు భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. వరద బాధితులకు పరిహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఎన్యుమరేషన్ పై మంత్రులు, అధికారులతో కలిసి రివ్యూ నిర్వహించారు. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియపై సిఎం చంద్రబాబు రివ్యూ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa