కోతి చేసిన పనికి భార్యభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడి నుంచో పురుగుల మందు ప్యాకెట్ను ఎత్తుకొచ్చిన మర్కటం.. ఆ దంపతులు ఉండే పెరట్లో పడేసింది. అది టీపొడిగా పొరబడిన ఈ వృద్ధ దంపతులు.. టీకాచి తాగారు. కొద్దిసేపటికే అస్వస్థతకు గురైన వారిని స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందూతు ఇరువురూ మృతి చెందారు. విషాదకర ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలంలోని పల్ల కడియం గ్రామంలో చోటుచేసుకుంది. వెలుచూరి గోవింద్ (75), అప్పాయమ్మ (70) అనే వృద్ధ దంపతులు గ్రామంలో నివాసం ఉంటున్నారు.
శుక్రవారం ఉదయం ఓ కోతి వారి ఇంటి పెరట్లోకి గుళికలు మందు ప్యాకెట్ను విసిరేసింది. అప్పాయమ్మకు కంటి చూపు తక్కువగా ఉండటంతో విష పదార్థాన్ని టీపొడి ప్యాకెట్గా భావించింది. అందులోని పురుగల మందుతో టీ పెట్టి.. తన భర్తకు ఇచ్చి ఆమె కూడా తాగింది.
ఆ పురుగుల మందు కలిపిన టీ తాగిన కొద్దిసేపటికి ఆ వృద్ధ దంపతులు నోటి నుంచి నురుగల కక్కుతూ అస్వస్థతకు గురయ్యారు. దీనిని గమనించిన స్థానికులు.. వారికి ఏమైందోనని ఆందోళన చెందారు. వెంటనే చికిత్స కోసం రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. వారిని బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చికిత్స పొందుతూ వృద్ధ దంపతులు ఇద్దరూ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందారు. ఈ సంఘటనతో పల్లకడియం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఈ దంపతులకు ముగ్గురు సంతానం కాగా కుమారుడు రాజమండ్రిలోని ఓ అపార్టుమెంట్లలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఇద్దరు కుమార్తెలకు వివాహాలైనా.. ఒక కుమార్తె కోటిపల్లి వెంకటలక్ష్మి భర్త చనిపోవడంతో పల్లకడియంలోనే ఉంటున్నారని పోలీసులు తెలిపారు. వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, గతంలోనూ ఓ కోతి ఇలాగే టీపొడి ప్యాకెట్ వీరి ఇంటి ఆవరణలో జార విడిచి వెళ్లిందని కుమార్తె వెంకటలక్ష్మి తెలిపారు. అప్పట్లో తమ తల్లి తీసి టీ పెట్టుకున్నారని ఆమె చెప్పారు. జంతువులు కానీ పక్షులు ఏమైనా వస్తువులను తీసుకొచ్చి ఇంటి ఆవరణలో పడేస్తే జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa