ప్రపంచస్థాయిలో పేరు ప్రఖ్యాతలు వున్న కొల్లేరు సరస్సును కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. మంగళవారం మండవల్లి మండలం పెద్ద, చిన్నఎడ్లగాడి వద్ద కొల్లేరు వరద ముంపును పార్టీ నేతలు, అధికారులతో కలిసి పరిశీలించారు. నారాయణ మాట్లాడుతూ కొల్లేరు సరస్సులో చేపల చెరువులను అక్రమంగా తవ్వడంతో కాలుష్య కోరల్లో చిక్కుకుని, వరద నీటి ప్రవాహానికి అవరోధంగా మారిందని అన్నారు. బుడమేరు, కొల్లేరు, ఉప్పుటేరుల్లోని ఆక్రమణల ప్రక్షాళన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలదేనన్నారు. 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లేరు ఆపరేషన్ చేసి కొద్ది మేర ఆక్రమణలను తొలగించిందని, కాని మళ్లీ అభయారణ్యం ఆక్రమణకు గురైందన్నారు. బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు, చంద్రయ్య డ్రెయిన్, ఎర్ర కాలువ వంటి 64 డ్రెయిన్ల ద్వారా లక్ష క్యూసెక్కుల వరద నీరు కొల్లేరులోకి చేరుతోందన్నారు. ఈ నీరంతా ఉప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళుతుందన్నారు. కొల్లేరు ప్రక్షాళన చేస్తే ప్రభుత్వానికి సీపీఐ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ కొల్లేరు ప్రక్షాళన చేయడంలో సుప్రీంకోర్టు మార్గదర్శ కాలను పాటించాలని, ఇందుకు సీపీఐ పోరాటం చేస్తుందన్నారు. ప్రకృతి విపత్తుల వల్ల ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా సంభవించిన వరదలతో ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు పూర్తిస్థాయిలో అతలాకుతలం అయ్యాయన్నారు. బుడమేరు ఆక్రమణల వల్ల విజయవాడ నష్టపోయిందన్నారు. జీవో నెంబరు 120 ప్రకారం 77,136 ఎకరాల్లో కొల్లేరు విస్తరించి వుందని దీనిని కాపాడాలన్నారు. కొల్లేరులో ఆక్రమణలు తొలగించి, చేపలు, రొయ్యల సాగును అరికట్టాలని డిమాండ్ చేశారు. సీపీఐ సహాయ కార్యదర్శి ఉప్పాల నాగేశ్వరరావు, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య, రైతు సంఘ నాయకులు, డ్రైనేజీ అధికారులు, తదితరులు ఈ ముంపు పర్యటనలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa