వచ్చేవారం తమ దేశంలో పర్యటించనున్న భారత్ ప్రధాని నరేంద్ర మోదీని తాను కలుస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మిచిగాన్లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ట్రంప్.. ప్రధాని మోదీ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ అద్భుతమైన వ్యక్తి అని ఆకాశనికెత్తేశారు. ‘వచ్చే వారం ఆయన ఇక్కడకు వస్తున్నారు.. నేను కలుస్తాను’ అని అన్నారు. అయితే, ఇరువురి భేటీకి సంబంధించిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో కలుసుకున్నారు. అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఇరు దేశాల మధ్య పలు వాణిజ్య, ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి.
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబరు 21 నుంచి 23 మధ్య అమెరికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. క్వాడ్ శిఖరాగ్ర సమావేశంతో పాటు ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశంలో పాల్గొనున్నారు. డెలావర్లో వేదికగా జరిగే క్వాడ్ దేశాధినేతల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాని నరేంద్ర మోదీలతో పాటు ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులు పాల్గొంటారు. వాస్తవానికి ఈ ఏడాది క్వాడ్ సదస్సు భారత్లో నిర్వహించాల్సి ఉంది. కానీ, అమెరికా విజ్ఞప్తి మేరకు వచ్చే ఏడాది నిర్వహణకు భారత్ అంగీకరించింది. క్వాడ్లో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ సభ్య దేశాలుగా ఉన్న విషయం తెలిసిందే.
ఇక, అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత సెప్టెంబరు 21న (ఆదివారం) న్యూయార్క్లోని ప్రవాసీ భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ఐరాస సాధారణ సభ నిర్వహించే ‘భవిష్యత్తు సదస్సు’లో పాల్గొంటారు. అలాగే, ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ-కండక్టర్స్, బయెటెక్నాలజీ రంగాల్లో రెండు దేశాల మధ్య మరింత సహకారాన్ని పెంపొదించేలా అమెరికా సంస్థలకు చెందిన పలువురు సీఈఓలతోనూ మోదీ సమావేశమవుతారని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే, బైడెన్ యంత్రాంగంలోని ముఖ్య నేతలు, ఇతర అధికారులతో మోదీ సమావేశమై భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరిచేలా చర్చలు సాగిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa