తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి లడ్డూ కల్తీపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో శనివారం టీటీడీ అత్యవసర సమావేశం నిర్వహించింది. తిరుపతిలోని టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో జరిగిన ఈ సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆగమ సలహాదారులు, అధికారులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల నెయ్యి వాడారన్న వార్తల నేపథ్యంలో ఆగమ శాస్త్ర ప్రకారం ఏం చేయాలనే దానిపై చర్చించారు. శ్రీవారి లడ్డూ అపవిత్రమైన నేపథ్యంలో తిరుమలలో మూడు రోజులపాటు మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. సెప్టెంబర్ 23 నుంచి 25 వరకూ మూడు రోజుల పాటు తిరుమలలో మహాశాంతి యాగం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఆలయాన్ని సంప్రోక్షణ చేయాలని కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే మహాశాంతి యాగం చేయాలా లేదా శ్రీవారి ఆలయంలో సంప్రోక్షణ జరపాలా అనే దానిపై రేపు (ఆదివారం) అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం నేపథ్యంలో ఆలయాన్ని తిరుమలలోని పోటును సంప్రోక్షణ చేయాలని చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారు. లడ్డూలు తయారుచేసే పోటుతో పాటుగా నెయ్యిని స్టోర్ చేసే ప్రాంతంలోనూ సంప్రోక్షణ జరపాలని సీఎం ఆదేశించారు. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో శుక్రవారం టీటీడీ అధికారులతో సమీక్షించిన చంద్రబాబు.. ఈ వ్యవహారంలో సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావును ఇప్పటికే ఆదేశించారు. నివేదికతో పాటుగా పోటు ప్రాంతంలో సంప్రోక్షణ జరపాలని సూచించారు.
మరోవైపు తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నూనె వాడకం వార్తల నేపథ్యంలో టీటీడీ ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి అన్న ప్రసాదంలో గో ఆధారిత ముడి సరుకులను తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ ముడి సరుకులను శ్రీవారి నైవేద్య ప్రసాదంలో ఉపయోగించాలా.. లేదా పూర్తిగా రద్దుచేయాలా అనే దానిని నిర్ణయించేందుకు కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ నిపుణుల కమిటి నివేదిక మేరకు దీనిపై నిర్ణయం తీసుకుంటామని టీటీడీ ఈవో జె. శ్యామలరావు ఇప్పటికే స్పష్టం చేశారు. తాజాగా మహా శాంతియాగం సైతం నిర్వహించాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa