ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోపణలు,,,,లడ్డూ వివాదంపై స్పందించిన కొడాలి నాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 25, 2024, 06:55 PM

మాజీ మంత్రి కొడాలి నాని అంటే తెలుగు రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వైసీపీ నేతల్లో ఫైర్ బ్రాండ్ కొడాలి నాని. ఒక్కోసారి మాటల్లో శ్రుతిమించినా.. వైసీపీ తరుఫున బలమైన వాణి వినిపిస్తూ ఉండేవారు. గుడివాడ నుంచి వరుస విజయాలు సాధించి.. వైఎస్ జగన్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాతి కాలంలో జరిగిన మంత్రివర్గ పునర్వవస్థీకరణలో కొడాలి నాని మంత్రి పదవి పోయింది. అయినా కూడా వైఎస్ జగన్ అన్నా.. వైసీపీ అన్నా కొడాలి నానికి ఏ మాత్రం అభిమానం తగ్గలేదు. వైఎస్ జగన్ గురించి టీడీపీ చేసే ఆరోపణలకు బలమైన కౌంటర్లు ఇస్తూ వచ్చారు. అయితే మొన్నటి ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నాని ఓడిపోయారు. కొడాలి నాని మీద టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము విజయం సాధించారు.


ఇక ఎన్నికల ఫలితాల తర్వాత కొడాలి నాని మీడియాలో కనిపించడం తగ్గిపోయింది. పైపెచ్చు రాజకీయంగా కూడా ఆయన కాస్త సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో కొడాలి నాని మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తిరుపతి లడ్డూ వివాదం గురించి టీడీపీ.. వైఎస్ జగన్ మీద, వైసీపీ మీద తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం.. వైఎస్ జగన్ మీద నేరుగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధినేత, వైసీపీ పార్టీకి మద్దతుగా నిలబడేందుకు కొడాలి నాని మళ్లీ ముందుకు వచ్చారు. తిరుమల లడ్డూ వివాదంపై కొడాలి నాని విలేకర్ల సమావేశం నిర్వహించి.. ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. మరో మాజీ మంత్రి పేర్ని నానితో కలిసి ప్రెస్ మీట్ పెట్టిన కొడాలి.. చంద్రబాబుపైనా విమర్శనాస్త్రాలు సంధించారు.


తిరుమల వెంకన్న స్వామిని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్న కొడాలి నాని.. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో నెయ్యిలో నాణ్యత లేదని 15 సార్లు నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపిన విషయాన్ని గుర్తుచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నాణ్యత లేదనే కారణంతో నెయ్యి ట్యాంకర్లను 18 సార్లు వెనక్కి పంపామని చెప్పారు. నాణ్యత లేని నెయ్యిని తిరుమల లడ్డూ తయారీలో వాడలేదన్న కొడాలి నాని.. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే కల్తీ నెయ్యితో లడ్డూలు తయారుచేశారంటూ ఆరోపిస్తున్నారని విమర్శించారు.


ఇక తిరుమల శ్రీవారి ఆలయం ప్రతిష్ట మంటగలిసేలా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారన్న కొడాలి నాని.. ఆ దేవుడు చంద్రబాబును క్షమించడని ఆరోపించారు. వైఎస్ జగన్, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిపై చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో... చంద్రబాబు తిరుమలలో ఎన్నిసార్లు గుండు చేయించుకున్నారో చెప్పాలంటూ కొడాలి నాని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిట్ ద్వారా కాకుండా.. సీబీఐ ద్వారా తిరుమల లడ్డూ విషయంలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అయితే అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నాని మాటల్లో కనిపించిన దూకుడు, వేడి కాస్త తగ్గాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa