తమిళనాడు రాజధాని చెన్నైలో నిర్వహించిన ఎయిర్ షోలో విషాదం చోటుచేసుకుంది. చెన్నైలోని మెరీనా బీచ్లో మెగా ఎయిర్ షో నిర్వహించారు. ఆదివారం కావటం, అందులోనూ సెలవు రోజులు కావటంతో సందర్శకులు ఎయిర్ షో చూడ్డానికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మెరీనా బీచ్ జనసంద్రంగా మారిపోయింది. మెరీనా బీచ్కు వచ్చే రోడ్లు మార్గాలు, మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. ఈ క్రమంలోనే ఎయిర్ షో అనంతరం తొక్కిసలాట జరిగింది. మెరీనా బీచ్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన తొక్కిసలాటలో నలుగురు చనిపోయినట్లు తెలిసింది. వందల మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు,
మరోవైపు 92వ ఎయిర్ఫోర్స్ డే పురస్కరించుకుని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు.. ఈ మెగా ఎయిర్ షో ఏర్పాటు చేశారు. చెన్నైలోని మెరీనా బీచ్లో 21 ఏళ్ల తర్వాత ఈ ఎయిర్ షో ఏర్పాటు చేశారు. మెగా ఎయిర్ షోలో భాగంగా సుఖోయ్ Su-30MKI, సారంగ్ హెలికాప్టర్ సందడి చేశాయి. గరుడ కమాండోలు తమ నైపుణ్యాలను, సన్నద్ధతను ప్రదర్శించారు. తమిళనాడు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఆదివారం కావటంతో ఎయిర్ షో చూడ్డానికి సందర్శకులు మెరీనా బీచ్కు పోటెత్తారు. ఇక ఎయిర్ షో చూడ్డానికి చిన్నపిల్లలు భారీ సంఖ్యలో వచ్చారు. అయితే చెన్నై ఎయిర్ షో ముగిసిన తర్వాత ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో తొక్కిసలాట జరిగినట్లు తెలిసింది.
మెరీనా బీచ్ రైల్వేస్టేషన్ వద్ద తొక్కిసలాట జరిగింది. సందర్శకులు భారీ సంఖ్యలో తరలిరావటంతో పాటుగా ఉక్కపోత వాతావరణం కారణంగా తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. డీహైడ్రేషన్ కారణంగా పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో పదుల సంఖ్యలో గాయపడ్డారు. అయితే గాయపడిన వారిని సిబ్బంది హుటాహుటిన అంబులెన్సులలో ఆస్పత్రికి తరలించారు. తొక్కిసలాటలో నలుగురు చనిపోయినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa