ఆహార భద్రతా ప్రమాణాల్లో ఏపీ ర్యాంకు ఈ ఏడాది కిందకు దిగజారిన నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ల్యాబులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎఫ్ఎస్ఎస్ఏఐతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం ఏపీలో FSSAI ల్యాబ్లు, మౌలిక వసతుల ఏర్పాటు చేయనుంది. అలాగే సిబ్బందికి శిక్షణ ఇవ్వనుంది. ఒప్పందంలో భాగంగా విశాఖపట్నం, తిరుమల, కర్నూలులో ప్రభుత్వం మైక్రో బయాలజీ ల్యాబ్లను ఏర్పాటు చేయనుంది. అలాగే 5 ప్రాథమిక ప్రయోగ కేంద్రాలు, 15 మొబైల్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ల్యాబ్లో రూ.21 కోట్లతో మౌలిక వసతుల ఏర్పాటు చేస్తారు.
మరోవైపు FSSAI, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య జరిగిన ఈ ఒప్పందం విలువ. రూ.88.41 కోట్లు. ఒప్పందంలో భాగంగా తిరుమల, కర్నూలులో రూ.20 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ల్యాబ్లను నెలకొల్పనున్నారు. అలాగే ఒక్కొక్కటి రూ.7.5 కోట్ల వ్యయంతో రూ.13 కోట్లు ఖర్చుచేసి ఏలూరు, ఒంగోలులో ప్రాథమిక ఆహార పరీక్షల ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తారు. అలాగే రాష్ట్రవ్యా్ప్తంగా ఆహార శాంపిళ్ల సేకరణతో పాటుగా శాంపిళ్ల విశ్లేషణ కోసం రూ.12 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూ.11 కోట్లు కేటాయించనున్నారు. ఈ మేరకు ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది.
మరోవైపు ఏపీలో ఇప్పటికే నాలుగు ఫుడ్ టెస్టింగ్ ల్యాబులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 22 ల్యాబులను టర్న్ కీ విధానంలో ఉపయోగించేందుకు కూడా ఫుడ్ సేఫ్టీ, ఏపీ ప్రభుత్వం మధ్య అంగీకారం కుదిరింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఏపీలో ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని పక్కాగా అమలుచేస్తామన్నారు. ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో ఏపీ మెరుగైన ర్యాంకు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. అధికారులతో తరుచూ తనిఖీలు, సమీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఇక తిరుమల లడ్డూ వ్యవహారం తెరపైకి వచ్చిన తర్వాత తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఏర్పాటు విషయం తెరపైకి వచ్చింది. ల్యాబ్ ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈవో సైతం పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తిరుమలలో ల్యా్బ్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa