ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటుగా, అటు కేంద్రంలో ఎన్డీఏ సర్కారు కొలువు దీరిన తర్వాత.. ఏపీకి కేంద్రం నుంచి నిధులు తరలివస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కేంద్రం రూ.100 కోట్లు నిధులు కేటాయించింది. 2027లో ఏపీలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే పుష్కరాల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు నిధులు విడుదల చేసింది. పుష్కరాల నేపథ్యంలో అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు ఈ వంద కోట్ల నిధులు కేటాయించారు. మరోవైపు కేంద్రం నుంచి నిధులు విడుదలైన క్రమంలో.. పర్యాటకశాఖ అధికారులు కూడా త్వరలోనే పుష్కరాల పనులను ప్రారంభించే అవకాశం ఉంది.
మరోవైపు 2027లో జరిగే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించి ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నివేదిక రూపొందించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో పుష్కర ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు ఓ బృందాన్ని సైతం కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఇక ఈ బృందంలో రెవెన్యూ, పోలీసు, ఆర్అండ్బీ, ఇరిగేషన్ శాఖల అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు. గోదావరి పుష్కరాల కోసం చేపట్టాల్సిన పనులపై ఈ బృందం నివేదిక తయారు చేసి.. మంత్రిత్వశాఖకు అందజేయనుంది.
ఇక పుష్కరాల కోసం నివేదిక తయారుచేసేందుకు గానూ బృందసభ్యులు గోదావరీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తారు.. భక్తుల భద్రతకు సంబంధించిన అంశాలతో పాటుగా ఘాట్ల పటిష్టత, విస్తరణ, రద్దీ నియంత్రణ వంటి అంశాలపై పరిశీలన జరుపుతారు. మొత్తానికి వచ్చే రెండు మూడు నెలల్లోగా చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేసి.. ఆ తర్వాత ఎలా ముందు కెళ్లాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు గోదావరి పుష్కరాల కంటే ముందుగానే గంగానదీ పుష్కరాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో గంగానది పుష్కరాల సమయంలో అనుసరించే విధానాలనే మన రాష్ట్రంలోనూ అమలు చేయాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఇక కేంద్ ప్రభుత్వం నుంచి వందకోట్లు నిధులు వచ్చిన నేపథ్యంలో పనులు కూడా త్వరలోనే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa