పుంగనూరు నియోజకవర్గం పీలేరులో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓ ఏనుగుల గుంపు రైతుపై దాడి చేసి దారుణంగా చంపేశాయి. కొన్ని రోజులుగా 15 ఏనుగులతో కూడిన గుంపు నియోజకవర్గంలో హల్చల్ చేస్తోంది. పంటపొలాలను నాశనం చేస్తూ రైతులకు కన్నీరు మిగుల్చుతున్నాయి. ఇదే క్రమంలో పుంగనూరు నుంచి పీలేరు వైపునకు వెళ్తూ ఓ మామిడి తోటలోకి ప్రవేశించాయి. వాటిని అడ్డుకునే ప్రయత్నం చేసిన రైతు రాజారెడ్డిపై తీవ్రంగా దాడి చేశాయి. కాళ్లతో తొక్కి, మట్టిలో కుక్కేసి రైతును దారుణంగా చంపేశాయి. ఈ ఘటన పీలేరులో తీవ్ర కలకలం రేపుతోంది. అయితే కొన్ని రోజులుగా దేవళంపేట, అయ్యవాండ్లపల్లె, ఎర్రపాపిరెడ్డిపల్లె ప్రాంతాల్లో ఏనుగులు సంచారం పెరిగిపోయింది.
తరచూ పంటపొలాలపై దాడులు చేస్తూ వాటిని నాశనం చేస్తు్న్నాయి. కడుపునిండా తినడం, మిగిలిన పంట తొక్కి నాశనం చేస్తూ రైతులకు క్షోభ మిగిల్చుతున్నాయి. అయితే రైతుపై దాడి ఘటనతో అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఏనుగులను అటవీ ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.అయితే చిత్తూరు, మన్యం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ఏనుగుల బెడద నుంచి రైతులు, పంటపొలాలను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా వెళ్లి కర్ణాటక ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుని వచ్చారు. ఆయా జిల్లాల్లో సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సానుకూలంగా స్పందించారు. మావటీలకు శిక్షణ, కుంకీ ఏనుగులు ఏపీకి తరలింపు, ఏనుగుల శిబిరాల సంరక్షణ వంటి పలు కీలక అంశాలపై ఏపీ, కర్ణాటక మధ్య ఒప్పందం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa