ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బుధవారం నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చింది. కొత్త విధానంలో మద్యం దుకాణాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. సోమవారమే రాష్ట్రవ్యాప్తంగా లాటరీ తీసి డ్రాలో గెలిచిన వారికి మద్యం దుకాణాలను కేటాయించారు. ఇక లాటరీలో మద్యం షాపులు దక్కించుకున్న వ్యాపారులు.. రెట్టించిన ఆనందంలో మద్యం షాపులు తెరిచేందుకు సిద్ధమయ్యారు. ఇలాగే మద్యం దుకాణాన్ని దక్కించుకుని సంతోషంగా బుధవారం నుంచి వ్యాపారం ప్రారంభిద్దామని అనుకున్న ఓ వ్యాపారికి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ఉదయం షాపు ప్రారంభిస్తారనగా.. మంగళవారం రాత్రే కొంతమంది దుండగులు షాపు తాళాలు పగలగొట్టి మద్యం బాటిళ్లు ధ్వంసం చేశారు.
శ్రీసత్యసాయి జిల్లాలో ఓ వైసీపీ నేత మద్యం దుకాణంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ధర్మవరం నియోజకవర్గం ఎర్రగుంట సర్కిల్ వద్ద ఉన్న బాల్ రెడ్డి అనే వైసీపీ నేత మద్యం దుకాణంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మంగళవారం రాత్రి షాపు తాళాలు బద్దలు కొట్టి మద్యం సీసాలను ధ్వంసం చేశారు. దుండగుల దాడిలో రూ.10 లక్షల విలువైన మద్యం బాటిళ్లు ధ్వంసమైనట్లు సమాచారం. ఉదయమే మద్యం షాపు ప్రారంభం కానుండగా.. రాత్రి వేళ దుండుగులు చేసిన ఈ పని స్థానికంగా చర్చనీయాంశమైంది. అయితే లాటరీలో మద్యం దుకాణం దక్కించుకున్నారనే కోపంతోనే ఎవరైనా ఈ పని చేసుంటారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మద్యం షాపు యజమాని బాల్ రెడ్డి సైతం ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇటీవలే మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 3396 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించగా.. 89882 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల ద్వారా ఏపీ ప్రభుత్వానికి రూ.1700 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. దరఖాస్తుల దారుల నుంచి లాటరీ తీసి అందులో వచ్చినవారికి మద్యం దుకాణాలను కేటాయించారు. వారంతా ఇవాళ మద్యం షాపులు తెరిచి.. నూతన మద్యం విధానం ప్రకారం మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa