రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఈ దీపావళి నుంచే మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని, సంబంధిత మార్గదర్శకాలను, విధి విధానాలను నిర్దేశిస్తూ ఇవాళే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు తెలిపారు. సచివాలయం నాలుగో బ్లాక్ ప్రచార విభాగంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడారు. ఈ నెల 31 న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, తదుపరి వెంటనే ప్రతి ఇంటికీ మొదటి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేయడం జరుగుతుందన్నారు. ఎల్.పి.జి.కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు అర్హతగా ఈ పథకం అమలు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. రాష్ట్రంలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, 1.47 రేషన్ కార్డులు ఉన్నాయని, వీరిలో అర్హులు అందరికీ ఈ పథకం వర్తింపచేయడం జరుగుతుందన్నారు. ఈ పథకం అమలుకై ప్రతి ఏడాది ప్రభుత్వం పై రూ.2,684.75 కోట్ల మేర భారం పడుతుందన్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కుంటున్నా సరే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ పథకం అమల్లో భాగంగా ఈ నెల 29 నుంచి గ్యాస్ బుకింగ్స్ ప్రారంభిస్తారు. గ్యాస్ బుకింగ్ చేసుకోగానే ఒక ఎస్.ఎం.ఎస్. సంబంధిత లబ్ధిదారుని ఫోన్ నెంబరుకు వెళుతుంది. పట్టణ ప్రాంతాల్లో అయితే గ్యాస్ బుక్ చేసుకున్న 24 గంటల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటల్లో సిలిండ్లను డెలివరీ చేస్తారు. అదే విధంగా, గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లోనే డి.బి.టి. విధానం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా రాయితీ సొమ్ము జమ చేస్తారు. ప్రభుత్వం అందజేసే మూడు ఉచిత సిలిండర్లలో మొదటి సిలిండర్ మార్చి 31 లోపు, రెండోది జూలై 31 లోపు, మూడోది నవంబరు 30 లోపు ఎప్పుడైనా పొందవచ్చు. ఈ పథకం అమలుకై ఏడాదిని మూడు బ్లాక్ పీరియడ్లు పరిగణిస్తారు. మొదటి బ్లాక్ పీరియడ్ ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు, రెండో బ్లాక్ పీరియడ్ ను ఆగస్టు 1 నుండి నవంబరు 31 వరకు మరియు మూడో బ్లాక్ పీరియడ్ ను డిసెంబరు 1 నుండి మార్చి 31 వరకు పరిగణిస్తారు. ఈ పథకం అమల్లో లబ్ధిదారులకు సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు.కాగా, ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే మూడు ఆయిల్ కంపెనీలతో మాట్లాడం జరిగిందని, ఆయిల్ కంపెనీల వద్ద మరియు ప్రభుత్వం వద్ద ఉన్న డేటాను సమన్వయం చేసుకుంటూ ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. ఈ పథకం అమలుకై ఆయిల్ కంపెనీలకు అడ్వాన్పుగా రూ.894.92 కోట్లను ఈ నెల 29న చెక్కు రూపేణా చెల్లించడం జరుగుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa