ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోకేష్ సీఎం.. కేంద్రంలోకి చంద్రబాబు!.. వైసీపీ ఎంపీ సంచలన ట్వీట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 04, 2024, 07:34 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ను ఉద్దేశించి వైసీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027లోనే ఏపీలో ఎన్నికలు వస్తాయని.. ఊహించని విధంగా వైసీపీ అధికారంలోకి వస్తుందంటూ ఆదివారం వ్యా్ఖ్యానించిన విజయసాయిరెడ్డి.. సోమవారం మరో ట్వీట్ చేశారు. 2027లో జమిలి ఎన్నికలు వస్తాయనే అంచనాల నేపథ్యంలో నారా లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని.. చంద్రబాబు కేంద్రంలోకి వెళ్లే ఆలోచన చేస్తున్నారంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.


"ఏపీలో ఏదో రకంగా నాలుగున్నర సంవత్సరాలు బతికి బట్టకట్టాలని, టీడీపీ తాపత్రయమా..? జమిలి.. జమిలి.. 2027లో ఎన్నికలంటూ సమాచారం వస్తున్న నేపథ్యంలో ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దోచుకోవడంలో టీడీపీ నిమగ్నమైందా? టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు తమ్ముళ్ల, దందాలు, దోపిడీలు, మోసాలు, హత్యలు, రేప్‌లు చూసి టీడీపీకి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..?కూటమి పార్టీల ముఖ్యనాయకులు, కార్యకర్తల మధ్య సయోధ్య లేక అవినీతి దొంగసొమ్ము వాటాలు పంచుకోవడంలో అంతర్గత కుమ్ములాటలతో ఐదునెలల పాలనలోనే ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో మతిమరుపువ్యాధితో చంద్రబాబు సతమతమౌతూ లోకేష్‌ని ముఖ్యమంత్రిని చేసే ప్రయత్నంలో ఉన్నారా? అరాచకాలకు పాల్పడుతున్న క్యాడర్, క్రమశిక్షణలేని ఎమ్మెల్యేలు, మంత్రులు, నిద్రాణవస్థలోకి చేజారిన అధికార యంత్రాంగం వల్ల చంద్రబాబు కేంద్రానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారా?" అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.


మరోవైపు కేంద్రం జమిలీ ఎన్నికలకు కసరత్తు చేస్తోందని.. 2027 నాటికి ఏపీలో మధ్యంతర ఎన్నికలు ఖాయమంటూ విజయసాయిరెడ్డి ఆదివారం జోస్యం చెప్పారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల వైసీపీ అధ్యక్షుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన విజయసాయిరెడ్డి.. ఈ వ్యాఖ్యలు చేశారు. 2027లో ఏపీలో ఎన్నికలు ఖాయమని.. వైసీపీ కార్యకర్తలు ఎన్నికల కోసం బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని సూచించారు. టీడీపీ కూటమి సర్కారు వైసీపీ కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు పెడుతోందన్న విజయసాయిరెడ్డి.. అభివృద్ధి మరచి, అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాజాగా చంద్రబాబు కేంద్రానికి, నారా లోకేష్‌ సీఎం అంటూ సంచలన ట్వీట్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com