కదులుతున్న రైలుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని భద్రక్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి పూరీకి వస్తున్న నందన్కానన్ ఎక్స్ప్రెస్ రైలుపై.. భద్రక్, బవుసపూర్ రైల్వే జంక్షన్ సమీపంలో దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో గార్డు బోగీ కిటికీకి ఓ బుల్లెట్ తగలడంతో అద్దం పగిలిపోయింది. ఈ శబ్దానికి తాను బయటకు రాగా.. చేతిలో తుపాకితో దుండగుల్లో ఒకరు పారిపోతూ కనిపించారని గార్డ్ మహేంద్ర బెహరా తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
కేసు నమోదుచేసిన పోలీసులు.. కాల్పులు జరిపింది ఎవరనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనతో రైలును భద్రక్ స్టేషన్ వద్ద కొద్దిసేపు నిలిపివేయగా.. తర్వాత అది సురక్షితంగా పూరీకి చేరుకుంది. ‘భద్రక్ సౌత్ ట్రాఫిక్ గేటు సమీపంలో సిగ్నల్స్ మార్చుతుండగా.. గుర్తుతెలియని వ్యక్తి రైలుపై కాల్పులు జరిపాడు.. అతడి చేతిలో తుపాకి ఉండటం నేను చూశాను.. రెండో రౌండ్ కాల్పులతో పొగలు రావడం గమనించాను.. తొలుత ఎవరో రాళ్లు విసిరారు అనుకున్నారు.. డోర్ దగ్గరకు వచ్చి చూసేసరికి ఒకరి చేతిలో తుపాకి ఉన్నట్టు తెలిసింది’ అని మహేంద్ర అన్నారు.
‘‘12816 ఢిల్లీ ఆనందర్ విహార్- పూరీ నందన్కానన్ ఎక్స్ప్రెస్ రైలు గార్డు వ్యాన్ కిటికీకి ఏదో తగిలి అద్దాలు పగిలినట్టు నివేదించారు. నివేదికల ప్రకారం ఈ సంఘటన ఒడిశాలోని భద్రక్-బౌద్పూర్ సెక్షన్లో జరిగింది’’ అని తూర్పు కోస్తా రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారని తెలిపారు. దుండగుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇటీవల కాలంలో రైలు పట్టాలపై ఇనుక కడ్డీలు, గ్యాస్ సిలిండర్లు ఉంచిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో రైలుపై కాల్పులు జరపడం మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటన జరిగి 24 గంటల కావస్తున్నా ఎవరు కాల్పులు జరిపారనేది తెలియరాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa