తిరుపతి లడ్డూ వివాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ద్వారా విచారణ జరిపించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించారంటూ.. సీఎం చంద్రబాబు నాయుడు అప్పట్లో ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సీబీఐ ద్వారా దర్యాప్తు జరిపించాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలంటూ కోరారు. ఈ పిటిషన్ మీద జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో తిరుపతి లడ్డూ ప్రసాదం తయారీ, ముడిసరుకుల సేకరణ, నిర్వహణలో అవినీతి ఆరోపణలపై సీబీఐ ద్వారా విచారణ చేయించాలని పాల్ కోరారు. ఈ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు.. మీ అభ్యర్థన ప్రకారం వెళ్తే.. దేశంలోని దేవాలయాలు, గురుద్వారాలు ఇలా అన్నింటిని ప్రత్యేక రాష్ట్రాలుగా చేయాల్సి వస్తుందంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఓ నిర్దిష్టమైన మతం కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆదేశించలేమంటూ ధర్మాసనం ఈ పిటిషన్ కొట్టివేసింది.
మరోవైపు సుప్రీంకోర్టు నిర్ణయంపై కేఏ పాల్ స్పందించారు. తిరుమలను కేంద్రపాలిత ప్రాంతం చేయాలంటూ తాను దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కేవలం ఐదు నిమిషాలనే విచారించిందన్నారు. తన పిటిషన్కు కేవలం ఐదు నిమిషాలే ఇచ్చారన్న కేఏ పాల్.. ఇంతటి ముఖ్యమైన విషయంలో సుప్రీంకోర్టు ఎక్కువ సమయం కేటాయించలేదన్నారు. ఈ విషయమై సుప్రీంకోర్టులో మరోసారి రివ్యూ పిటిషన్ వేస్తానని చెప్పుకొచ్చారు.
మరోవైపు తిరుమల లడ్డూ వివాదంపై ఇప్పటికే స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ బృందంలో సీబీఐ అధికారులు ఇద్దరూ, ఏపీ పోలీసులు ఇద్దరితో పాటుగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారి ఒకరిని నియమించాలని స్పష్టం చేసింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు సాగాలని సుప్రీంకోర్టు అక్టోబర్ నాలుగో తేదీన స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa