మరో 4 రోజుల్లో జార్ఖండ్ అసెంబ్లీ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న సమయంలో.. ఆ రాష్ట్రంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలు తీవ్ర సంచలనంగా మారాయి. ఏకంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా నేత హేమంత్ సోరెన్కు వ్యక్తిగత సహాయకుడు సునీల్ శ్రీవాస్తవ సహా పలు ఇళ్లలో ఇన్కం ట్యాక్స్ సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ సోరన్ సీఎం పదవికి రాజీనామా చేసి జైలుకు వెళ్లి.. తిరిగి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత జరుగుతున్న ఎన్నికల వేళ.. ఈ పరిణామం చోటు చేసుకోవడం జార్ఖండ్లో రాజకీయాలు తీవ్ర ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు అత్యంత సన్నిహితంగా ఉండే సునీల్ శ్రీవాస్తవ ఇళ్లు, కార్యాలయాల్లో శనివారం ఉదయం నుంచి ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని రాంచీలోని అశోక్ నగర్లోని ఆయన ఇంటితోపాటు జంషెడ్పూర్ సహా జార్ఖండ్ వ్యాప్తంగా 9 ప్రాంతాల్లో ఐటీ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. సునీల్ శ్రీవాస్తవ.. సీఎం హేమంత్ సోరెన్కు వ్యక్తిగత సలహాదారుడిగా ఉన్నారు. ఈ సోదాల్లో సునీల్ శ్రీవాస్తవ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించి పలు పత్రాలను పరిశీలించింది. అయితే ఈ ఐటీ సోదాల వెనుక కీలకమైన విచారణకు సంబంధించిందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
అయితే అంతకుముందు అక్టోబర్ 14వ తేదీన జల్ జీవన్ మిషన్ కుంభకోణానికి సంబంధించి హేమంత్ సోరెన్ మంత్రివర్గంలో ఉన్న మంత్రి మిథిలేష్ ఠాకూర్ సోదరుడు వినయ్ ఠాకూర్.. ఆయన ప్రైవేట్ సెక్రటరీ హరేంద్ర సింగ్ సహా పలువురు ఇంజనీర్లపై ఈడీ అధికారుల బృందం దాడులు చేసింది. ఇక భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ ముక్తి మోర్చా -జేఎంఎం నేత హేమంత్ సోరెన్కు జూన్లో జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈ భూ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీఎం హేమంత్ సోరెన్ను 7 గంటలకు పైగా విచారణ జరిపిన తర్వాత ఈ ఏడాది జనవరి 31వ తేదీన అరెస్ట్ చేసింది. దీంతో హేమంత్ సోరెన్ జార్ఖండ్ రాజ్భవన్కు వెళ్లి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీకి రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 43 స్థానాలకు నవంబర్ 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన 38 స్థానాలకు నవంబర్ 20వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 23వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి.. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. జార్ఖండ్లో మొత్తం 2.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 29,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీతో జార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగియనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa