ఇద్దరు సోదరులు, వారి ఫ్రెండ్ కలిసి విదేశాల నుంచి చిప్స్ ప్యాకెట్లు తెస్తున్నారు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా అందులో గంజాయిని ప్యాక్ చేసి తరలిస్తున్నారు. ఇక ఎయిర్పోర్టులో అధికారులకు దొరకకుండా ఉండేందుకు ఖరీదైన గంజాయిని.. చిప్స్ ప్యాకెట్లలో దాచి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే వారి వద్ద 100 చిప్స్ ప్యాకెట్లు ఉండటంతో ఎయిర్పోర్టు అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో ఆ చిప్స్ ప్యాకెట్లను ఓపెన్ చేసి చూడగా.. అసలు బండారం బయట పడింది. బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి.. ఢిల్లీ నుంచి చెన్నై ఎయిర్పోర్టుకు వచ్చిన వారు ముగ్గురు చెకింగ్లో దొరకలేదు. అయితే ఎయిర్పోర్టు బయట.. నార్కొటిక్స్ అధికారులు వారి బ్యాగుల్లో ఉన్న చిప్స్ ప్యాకెట్లు తెరిచి చూడగా అసలు విషయం బయటికి వచ్చింది.
తమిళనాడులోని కొడుంగయ్యూర్కు చెందిన మహ్మద్ యూసఫ్ (32), అతని తమ్ముడు హరూన్ (30), వారి ఫ్రెండ్ ఫరూక్ (34)లను తాజాగా చెన్నై ఎయిర్పోర్టు నుంచి బయటికి వచ్చిన తర్వాత యాంటీ నార్కొటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఏఎన్ఐయూ నిర్వహించిన తనిఖీల్లో వారి వద్ద భారీగా గంజాయి లభించింది. అయితే వారు ఎయిర్పోర్టు తనిఖీల్లో పట్టుబడకుండా ఉండేందుకు పెద్ద ప్లాన్ వేసినట్లు గుర్తించారు. చిప్స్ ప్యాకెట్లలో గంజాయిని ఉంచి బ్యాంకాక్ నుంచి చెన్నైకి తీసుకువస్తున్నట్లు గుర్తించారు. అది కూడా హై క్వాలిటీ గంజాయి(కుష్ కెన్నాబీస్) అని అధికారులు వెల్లడించారు. థాయిలాండ్లో వారు గంజాయిని కొనుగోలు చేసి.. అక్కడి నుంచి తరలిస్తున్నారని గుర్తించారు. ఆ గంజాయి విలువ రూ.50 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.
మహ్మద్ యూసఫ్, హరూన్, ఫరూక్.. చెన్నై ఎయిర్పోర్టు నుంచి బయటికి రాగానే అనుమానం వచ్చి వారు ముగ్గుర్నీ అరెస్ట్ చేసినట్లు నార్కొటిక్స్ అధికారులు తెలిపారు. అయితే వారి వద్ద లగేజీలో మొదట ఎలాంటి గంజాయి దొరకలేదని పేర్కొన్నారు. అయితే వారి బ్యాగుల్లో 100 చిప్స్ ప్యాకెట్లు ఉండటం వారికి అనుమానం కలిగించింది. ఎక్కడైనా తక్కువ ధరకే దొరికే చిప్స్ను వారు.. బ్యాంకాక్ నుంచి ఎందుకు తీసుకువచ్చారా అనే అనుమానం కలిగింది. దీంతో కొన్ని ప్యాకెట్లను ఓపెన్ చేసి చెక్ చేశారు. ఆ తర్వాత మరిన్ని ప్యాకెట్లు తెరిచి చూడగా.. మొత్తం బండారం బయటికి వచ్చింది.
ఆ చిప్స్ ప్యాకెట్లలో గంజాయిని పాలిథీన్ కవర్లలో చుట్టి ఎవరికీ అనుమానం రాకుండా ప్యాక్ చేసినట్లు నార్కొటిక్స్ అధికారులు గుర్తించారు. అయితే ఇలా చేస్తే.. ఎయిర్పోర్టులో ఉండే బ్యాగేజీ స్కానర్లో కూడా కనిపెట్టలేమని అధికారులు వెల్లడించారు. ఆ చిప్స్ ప్యాకెట్లలో 13 బండిళ్ల గంజాయిని దాచి తరలిస్తున్నట్లు తేల్చారు. దీంతో వారు ముగ్గుర్నీ అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అయితే వారు బ్యాంకాక్లోని గంజాయి స్టేషన్ నుంచి ఈ గంజాయిని కొనుగోలు చేసి.. ఆ తర్వాత బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి.. అనంతరం ఢిల్లీ నుంచి చెన్నైకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నట్లు గుర్తించారు. అనంతరం వారిపై కేసులు నమోదు చేసి.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక విచారణలో ఇతర రాష్ట్రాల్లో కూడా వారిపై గతంలో కేసులు నమోదైనట్లు వెల్లడైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa