కొన్ని కొన్ని విషయాలు వినడానికి, చూడటానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి. ఇంత చిన్న విషయానికే అంత పెద్ద నిర్ణయం తీసుకోవాలా అనేలా ఉంటాయి. కానీ.. క్షణికావేశం ఎంత కఠిన నిర్ణయమైనా తీసుకునేలా చేస్తుంది. ఆ ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే.. ఎన్నో కుటుంబాలకు కడుపుకోతలు తగ్గుతాయి. ఎంతో మంది కన్నవాళ్లకు కన్నీటి మంటలు ఉండవు. కానీ.. ప్రతి చిన్న విషయానికి చాలా ఎమోషనల్ అవుతున్న నేటి యువత.. ఆ బలహీన క్షణాన్ని భరించలేకపోతోంది. ఆ గండాన్ని దాటలేక ఆయువు తీసుకుంటోంది. పల్నాడు జిల్లాలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. పెన్ను కోసం జరిగిన గొడవ.. ఓ విద్యార్థిని ప్రాణం తీసింది.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెన్ను విషయంలో తలెత్తిన గొడవ ఓ ఇంటర్ విద్యార్థిని ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన జెట్టి అనూష నరసరావుపేటలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రైవేట్ కాలేజీ హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుకుంటోంది. అయితే శనివారం ఉదయం హాస్టల్లోని స్నేహితురాలితో అనూషకు గొడవ జరిగింది. పెన్ను విషయంలో ఇద్దరి మధ్య స్వల్ప వివాదం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన అనూష.. హాస్టల్ మీద నుంచి దూకేసింది. నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకటంతో తీవ్రంగా గాయాలైన అనూషను హాస్టల్ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అనూష చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.
మరోవైపు విద్యార్థిని ఆత్మహత్యపై ప్రైవేట్ కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో నరసరావుపేట పోలీసులతో పాటుగా నరసరావుపేట ఆర్డీవో హేమలత, తహసీల్దార్ వేణుగోపాల్ ఘటనాస్థలికి చేరుకున్నారు. హాస్టల్ విద్యార్థులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే చిన్న పెన్ను విషయంలో జరిగిన గొడవతో విద్యార్థిని ప్రాణం తీసుకోవడం ఆ కన్నవాళ్లకు కడుపుకోతను మిగిల్చింది. బాగా చదువుకుని గొప్ప ఉద్యోగం చేస్తుందంటూ మురిసిపోయిన విద్యార్థిని తల్లిదండ్రులు.. ఊహించని రీతిలో ప్రాణాలు పోగొట్టుకోవటంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa