రాష్ట్రంలోని రైతుల కుటుంబాల్లో ఎన్నడూ లేనంత ఆనందం కనిపిస్తోందని, పంట పొలాల్లో పండుగ వాతావరణం నెలకొందని ఏపీ ఆహారం, పౌరసరఫరాలు, వినియోగదారుల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో రూ.418.75 కోట్ల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. గతంలో ఎప్పుడెప్పుడా నగదు జమ పడేది అని ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై పటిష్ట ప్రణాళిక అమలు చేస్తోందని పేర్కొన్నారు. ధాన్యం విక్రయించిన 24 గంటల్లో నగదు జమ చేస్తున్నామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ విధానాల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి నాదెండ్ల తెలిపారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లో నగదు అకౌంట్లోకి జమ అవడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉందని రైతులు చెబుతున్నారని వెల్లడించారు. "రాష్ట్రంలో తూర్పు, పశ్చిమ, ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మొత్తం 617 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 24,051 మంది రైతుల నుంచి 1,81,988 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటివరకు రూ.418.75 కోట్ల ధాన్యం కొనుగోలు చేశాం. ఇందులో రూ.391.50 కోట్ల మేర చెల్లింపులు జరిపాం. 24 గంటల్లోపు రూ.281.30 కోట్లు రైతులు ఖాతాలో జమ చేశాం. మిగిలిన రైతుల ఖాతాల్లో 48 గంటల్లో రూ.10.20 కోట్ల నగదు జమ చేశాం. ధాన్యాన్ని ఎప్పుడు ఎక్కడ అమ్ముకోవాలో రైతులే నిర్ణయించుకునేలా కూటమి ప్రభుత్వం వాట్సాప్ చాట్బోర్డ్ని ప్రవేశపెట్టింది. రైతులు కొనుగోలు కేంద్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా మొబైల్ ఫోన్ ద్వారా ప్రత్యేక వాయిస్ సేవలందిస్తున్నాం. గోతాల సరఫరా నుంచి రవాణా వరకు అన్ని విధానాలను మా ప్రభుత్వం సులభతరం చేసింది" అని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa