తిరుమల తిరుపతి వెంకన్న అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు అందరికీ ఎంతో నమ్మకం, విశ్వాసం. జీవితంలో ఒక్కసారైనా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి దర్శనం చేసుకోవాలని తపిస్తూ ఉంటారు. అందుకే వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ ఆ నారాయణుడి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కోట్లకు పడగలెత్తిన కుబేరుడి నుంచి కటిక పేదరికంలో ఉండే కుచేలుడి వరకూ అందరి ఆరాధ్య దైవం ఆ శ్రీనివాసుడే. ఇంతటి విశిష్టమైన పుణ్యక్షేత్రం కాబట్టే.. తిరుమల కొండపై జరిగే ప్రతి చిన్న ఘటన కూడా కోట్లాదిమంది హిందువుల మనోభావాలపై పెను ప్రభావం చూపుతుంది. ఏడుకొండలపై జరిగే ఏ చిన్న ఘటనైనా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన అపశ్రుతి ఆలస్యంగా బయటకు వచ్చింది. సుమారుగా మూడేళ్ల కిందట జరిగిన ఘటన ఇప్పుడు వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. 2021లో తిరుమల శ్రీవారి ఆలయంలో రాములవారి ఉత్సవ విగ్రహం వేలు విరిగిపోయింది. అయితే అప్పట్లో దీనిని పట్టించుకోలేదు. మూడు రోజుల కిందట రాముల వారి ఉత్సవ విగ్రహం వేలును అర్చకులు సరిచేశారు. మరమ్మత్తులు పూర్తి చేసిన తర్వాత రెండు రోజుల నుంచి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో మూడేళ్ల కిందట జరిగిన ఘటన ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే ఘటన జరిగి సుమారుగా మూడేళ్లు గడిచినా.. ఇన్నిరోజులు పట్టించుకోకపోవటంపైనా భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఇటీవలే తిరుమలలో అన్యమత ప్రచారం వదంతులు కూడా కలకలం రేపాయి. తిరుమల కొండపై అన్యమత ప్రచారం పూర్తిగా నిషిద్ధం. అలాంటిది పాపవినాశనం వద్ద ఓ మతానికి చెందిన కొంతమంది తమ మతానికి అనుకూలంగా ప్రచారం చేశారంటూ పుకార్లు వచ్చాయి. పాపవినాశనం వద్ద పాటలతో రీల్స్ చేశారని.. స్థానికంగా హోటళ్లలో పనిచేసే మహిళలే ఈ పని చేశారంటూ ఇటీవల వదంతులు వచ్చాయి. ఈ వార్తలపైన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కూడా దృష్టిసారించి.. దర్యాప్తు జరిపినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. తిరుమలలో అన్యమత ప్రచారం నిషేధం కాగా.. టీటీడీలో పనిచేసే అన్యమతస్థులను కూడా ఇతర ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేసే విషయమై టీటీడీ ఆలోచన చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa