రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం విజయవంతంగా అమలవుతుందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ పథకం పారదర్శకంగా కొనసాగుతున్నా.. కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మంత్రి దీపం 2 పథకం ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకం లబ్ధిదారులతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. దీపం-2 పథకం లబ్ధిదారుల సంఖ్య మూడు వారాల్లోనే 50 లక్షల మైలురాయిని చేరుకుందని తెలిపారు.
దీపం పథకానికి గ్యాస్ కనెక్షన్, ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉండాలని తెలిపారు మంత్రి. కొందరు వైఎస్సార్సీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని.. ఎవరూ నమ్మొద్దని కోరారు. ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విచిత్రంగా.. రాష్ట్రంలో కోటి 85 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని చెప్పారని.. అదనంగా ఉన్న 30 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇంట్లో కూర్చుకుని బటన్ నొక్కారా అంటూ ఎద్దేవా చేశారు. గ్యాస్ కంపెనీలు ఇచ్చిన సమాచారం మేరకు కోటి 55 లక్షల 200 కనెక్షన్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఇప్పటికే రూ.894 కోట్లు అడ్వాన్స్ కింద జమ చేశామన్నారు. 1999లోనే చంద్రబాబు దేశంలోనే మొదటిసారిగా మహిళల ఆరోగ్య భద్రత గురించి ఆలోచన చేసి దీపం పథకం అమలు చేశారని గుర్తు చేశారు.. ఉమ్మడి ఏపీలో గ్యాస్ బండలు ఇచ్చారన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మహిళల కోసం ప్రత్యేకంగా పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు నాదెండ్ల. దీపం పథకం విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందుతాయని.. ఎవరికీ ఎటువంటి అపోహలు అవసరం లేదన్నారు. అలాగే ఇప్పటివరకు 521 ఫిర్యాదులు మాత్రమే వచ్చాయంటే ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంత పారదర్శకంగా అమలు చేస్తుందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. వాస్తవానికి 2025 మార్చి 31 వరకు సమయం ఉన్నా సరే.. మూడు వారాల్లోనే 50 లక్షలమంది ఉచిత గ్యాస్ పథకాన్ని ఉపయోగించుకున్నట్లు తెలిపారు. గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటల్లోనే బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే గద్దే రామ్మోన్. గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన 48 గంటల్లో అకౌంట్లలో డబ్బులు జామ చేయటం కూటమి ప్రభుత్వం పారదర్శక పాలనకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. అలాగే ప్రజలకు తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారని.. రేషన్ బియ్యం అక్రమాలను అరికట్టడం గొప్ప విషయమన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం.. మంచి ప్రభుత్వం అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa