రాజస్థాన్లో ఘోరం జరిగిపోయింది. డాక్టర్ల నిర్లక్ష్యం ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. యువకుడు చనిపోయాడని డాక్టర్లు ధ్రువీకరించడంతో.. అతడికి అంత్యక్రియలు చేసేందుకు స్థానికులు ఏర్పాట్లు చేశారు. అతడు అనాథ కావడంతో ఇరుగు పొరుగు వారే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే అంతిమయాత్ర చేపట్టి.. చితి వద్దకు తీసుకెళ్లారు. ఆ యువకుడిని చితిపై ఉంచారు. ఇక ఆ చితికి నిప్పంటించేందుకు ప్రయత్నించగా.. అతడిలో కదలికలను స్థానికులు గుర్తించారు. దీంతో అతడు చనిపోలేదని గుర్తించి.. స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో పైఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు.
రాజస్థాన్లోని జున్జున్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రోహితాష్ కుమార్ అనే 25 ఏళ్ల చెవిటి, మూగ యువకుడు.. జున్జున్లోని ఓ పునరావాస కేంద్రంలో ఒంటరిగా నివసిస్తున్నాడు. అతడి తల్లిదండ్రులు ఎవరూ లేకపోవడంతో ఒక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే గురువారం రోహితాష్ కుమార్ అపస్మారకస్థితిలో ఉండటాన్ని చూసిన స్థానికులు అతడిని స్థానికంగా ఉన్న బీడీకే ఆస్పత్రికి తరలించారు. అతడ్ని పరీక్షించిన డాక్టర్లు.. మధ్యాహ్నం 2 గంటలకు చనిపోయినట్లు ప్రకటించారు. ఆ తర్వాత మార్చురీకి తరలించి.. 2 గంటలపాటు అక్కడే ఉంచి తర్వాత సంబంధిత వ్యక్తులకు అప్పగించారు.
పోలీసుల విచారణ పూర్తయిన తర్వాత అంత్యక్రియల కోసం రోహితాష్ కుమార్ను తరలించారు. స్థానికులు.. చితి ఏర్పాటు చేయగా.. దానిపై ఉంచిన కొద్దిసేపటికే అతడిలో కదలికలు గమనించారు. వెంటనే అంబులెన్సును రప్పించి మళ్లీ అదే బీడీకే ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ఆ తర్వాతి రోజు మెరుగైన చికిత్స కోసం జైపూర్లోని ఎస్ఎంఎస్ హాస్పిటల్కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే రోహితాష్ కుమార్ కన్నుమూశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.
ఈ వ్యవహారం కాస్తా జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ బీడీకే ఆస్పత్రిలో పనిచేసే ముగ్గురు డాక్టర్లు డాక్టర్ యోగేష్ జాఖర్, డాక్టర్ నవనీత్ మీల్, పీఎంవో డాక్టర్ సందీప్లపై సస్పెన్షన్ వేటు వేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వారిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసేందుకు రమావతార్ మీనా నేతృత్వంలో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa