కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ.. దాని నుంచి కోలుకోకముందే రాజీనామా దెబ్బ పడింది. మహారాష్ట్ర పీసీసీ చీఫ్గా ఉన్న నానా పటోలే.. తన పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఉద్ధవ్ ఠాక్రే శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ నేతృత్వంలోని మహా వికాస్ ఆఘాడీ కూటమి.. ఘోరంగా దెబ్బతిన్న వేళ.. కాంగ్రెస్ పార్టీ పరాజయానికి బాధ్యతగా.. నానా పటోలే రాజీనామాకు సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలి అని.. కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉండగా.. శనివారం వెల్లడైన ఫలితాల్లో బీజేపీ-షిండే శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 233 స్థానాల్లో విజయం సాధించి.. తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 51 చోట్ల మాత్రమే గెలుపొందింది. ఇక 288 స్థానాలకు గానూ కూటమిలో సీట్ల సర్దుబాటులో భాగంగా 101 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. అయితే ఈ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ.. కేవలం 16 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో మహారాష్ట్ర ఏర్పడిన నాటినుంచి ఎన్నడూ లేనంత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పతనం కనిపించింది.
మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నానా పటోలే 2021లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో.. నానా పటోలే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ.. మొత్తం 48 లోక్సభ సీట్లకు గానూ 17 స్థానాల్లో పోటీ చేసింది. అందులో 13 స్థానాలను గెలుచుకుని అద్భుతమైన ప్రదర్శన చేసింది. దీంతో మహా వికాస్ ఆఘాడీ కూటమి ఈసారి ఎలాగైనా మహారాష్ట్రలో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని అంతా భావించినా.. అది జరగలేదు. కనీసం ఎగ్జిట్ పోల్స్ సంస్థలు చెప్పిన అంచనాలను కూడా అందుకోవడంలో మహా వికాస్ ఆఘాడీ కూటమి విఫలం అయింది.
ఇక ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సకోలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నానా పటోలే కేవలం 208 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు.. నరేంద్ర మోదీ హవాతో తీవ్రంగా దెబ్బతింది. దీంతో 2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీకి కేవలం 42 సీట్లు మాత్రమే వచ్చాయి. అప్పటినుంచి క్రమంగా కాంగ్రెస్ పార్టీ పతనం కొనసాగుతుండగా.. తాజాగా జరిగిన 2024 ఎన్నికల్లో 16 స్థానాలకు పడిపోవడం.. ఆ పార్టీని కోలుకోకుండా చేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో పడిపోవడానికి కారణం.. ఆ పార్టీ కొన్ని వర్గాలపైనే ఎక్కువగా ఆధారపడటం.. హస్తం పార్టీ నేతలు ఎన్నికల వేళ ప్రజల్లోకి వెళ్లకపోవడం సహా అనేక అంశాలతో మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించకపోవడానికి కారణాలు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa