కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబం భవిష్యత్తు అగమ్యగోచరం. నడిసంద్రంలో పడవను నడిపే నావికుడు హఠాత్తుగా కనుమరుగైతే.. సంద్రంలో చిక్కుకున్న ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంటుందో.. ఆ కుటుంబం పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఆర్థికంగా, ఆలంబనగా అన్నిరోజులూ ఏ కష్టం రాకుండా చూసుకున్న వ్యక్తి దూరమైన ఆవేదన వైపు.. భవిష్యత్తుపై బెంగ మరోవైపు.. ఇలాంటి పరిస్థితులతో సతమతమయ్యే కుటుంబాలు ఎన్నో. అయితే భర్తను కోల్పోయి.. కుటుంబాన్ని నడపకలేక ఆర్థికంగా ఇబ్బందులు పడే వితంతువులకు భరోసా కల్పించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వితంతు పింఛన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. భర్తను కోల్పోయిన భార్యకు వెంటనే వితంతు పింఛన్ మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది.
వితంతు పింఛన్ల కోసం గతంలో కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి. అయితే వితంతువులకు ఆ ఇబ్బంది కలగకుండా ఏపీ సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఒకటో తేదీ నుంచి 15వ తేదీలోపూ భర్త మరణిస్తే. ఆ భార్యకు వెంటనే వితంతు పింఛన్ అందించాలని నిర్ణయించింది. నెలలో 15 నుంచి 30వ తేదీలోపు భర్త మరణం సంభవిస్తే.. అలాంటి ఘటనల్లో ఆ వితంతువుకు వచ్చే నెల నుంచి పింఛన్ అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో పాటుగా, ఇతర డాక్యుమెంట్లను ఎంపీడీవోకు సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు వృద్ధాప్య పింఛన్ తీసుకునేవారు మరణిస్తే.. అతని భార్యకు వెంటనే పింఛన్ మంజూరు అయ్యేలా చూడాలని ఆదేశించినట్లు సమాచారం.
మరోవైపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. భర్తను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న వితంతువులకు ఈ నిర్ణయం కారణంగా భరోసా దక్కుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పింఛన్ల పంపిణీలోనూ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. ఏవైనా కారణాలతో పింఛన్ తీసుకోలేకపోయినవారికి మరుసటి నెలలో పింఛన్లు అందించేలా నిర్ణయం తీసుకున్నారు. మూడు నెలల పింఛన్ ఒకేసారి తీసుకునేలా ఏర్పాటు చేశారు. అలాగే ఒకటో తేదీ ఆదివారం లేదా సెలవు రోజు వస్తే ఒకరోజు ముందుగానే పింఛన్ అందిస్తున్నారు. ఈ నిర్ణయాలపై హర్షం వ్యక్తమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa