ఆంధ్రప్రదేశ్లో మెడికల్ టెక్నాలజీ, మెటీరియల్ సైన్స్ రంగాల అభివృద్ధి దిశగా మరో కీలక అడుగుపడింది. ఏఎస్ఎమ్ ఇంటర్నేషనల్ సంస్థ విశాఖపట్నంలోని ఏపీ మెడ్టెక్ జోన్లో ఆఫీసు ప్రారంభించింది. ఏఎస్ఎమ్ ఇంటర్నేషనల్ సంస్థను అమెరికన్ సొసైటీ ఫర్ మెటల్స్ అని కూడా పిలుస్తారు. ఏఎస్ఎమ్ ఇంటర్నేషనల్ మాజీ ప్రెసిడెంట్, ప్రదీప్ మెటల్స్ ఎండీ, ఛైర్మన్ అయిన ప్రదీప్ గోయెల్ విశాఖపట్నంలో ఏఎస్ఎమ్ ఆఫీసును ప్రారంభించారు. విశాఖపట్నంలో ఏఎస్ఎమ్ ఆఫీసు ప్రారంభం కావటం.. ఏపీలో మెటలర్జీ కమ్యూనిటీని బలోపేతం చేయనుంది. మెడ్టెక్ రంగంలో అడ్వాన్స్డ్ మెటీరియల్ సైన్స్ను ప్రోత్సహించడం ద్వారా తయారీదారులు, వ్యాపారులు, వినియోగదారులు, విద్యార్థులకు అవకాశాలు లభించనున్నాయి.
ఏఎస్ఎం ఇంటర్నేషనల్.. మెటీరియల్ సైన్స్, ఇంజినీరింగ్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఏఎస్ఎమ్ ఇంటర్నేషనల్ లోహాలు, సిరామిక్స్, పాలిమర్లను తయారు చేస్తుంది. మరోవైపు ఏఎస్ఎమ్ ఇంటర్నేషనల్ వైజాగ్ ఆఫీసు కోసం వందమందిని తొలుత తీసుకుంటారు. అకడమియా, ఇండస్ట్రీ, ఆరోగ్య రంగాలకు ఏఎస్ఎమ్ ఇంటర్నేషనల్ వారధి కానుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఏఎస్ఎమ్ ఇంటర్నేషనల్తో పాటుగా విశాఖలో పలు ప్రాజెక్టుల ఏర్పాటుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో.. కెమికల్, బయోలాజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ మెడికల్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ మధ్య చర్చలు జరుగుతున్నాయి.
మరోవైపు భీమిలిలో సోలార్ ఎనర్జీ పైలెట్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం, గంభీరమ్, చిప్పాడ, రెడ్డిపల్లి, వెల్లంకి, రాజుల తల్లవలస గ్రామాలను సోలార్ ఎనర్జీ పైలెట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసినట్లు తెలిసింది. స్థానిక ఎమ్మెల్యే ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. విశాఖ రైల్వేజోన్ కార్యాలయం నిర్మాణం కోసం టెండర్లు పిలుస్తామని.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీంతో విశాఖపట్నం రైల్వే జోన్ కార్యాలయానికి త్వరలోనే శంకుస్థాపన జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa