ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శరవేగంగా రాజధాని నిర్మాణం.. అమరావతిలో భూ కేటాయింపులు, టీటీడీకి 25 ఎకరాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2024, 10:17 PM

నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి.. మంత్రి నారాయణ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా సచివాలయంలో భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ.. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి పనులు మొదలుపెట్టాలని తెలిపింది. అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు గతంలో పలు సంస్థలకు ప్రభుత్వం భూ కేటాయింపులు చేయగా.. ఆయా సంస్థల ఏర్పాటు, కొత్తగా భూ కేటాయింపులకు వచ్చిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించారు. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, టీజీ భరత్, సంధ్యా రాణి, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


అమరావతిలో ఈఎస్‌ఐ ఆస్పత్రితో పాటు మెడికల్ కాలేజీ కోసం 20 ఎకరాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. గతంలో 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం హయాంలో కేటాయించిన పలు సంస్థలకు సమయం ముగియడంతో మరోసారి గడువు పొడిగించింది. దీంతోపాటు సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్స్‌ అండ్‌ డిజైన్‌కు 5 ఎకరాలు కేటాయించింది. ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీకి 0.8 ఎకరాలు.. బసవతారకం క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌కు 15 ఎకరాలు ఇచ్చింది. ఎల్‌ అండ్‌ టీ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌కు 5 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ తెలిపారు.


 అంతేకాకుండా బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీకి 10 ఎకరాలు కేటాయించినట్లు వెల్లడించారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానానికి గతంలో కేటాయించిన 25 ఎకరాలకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. గతంలో 131 మందికి భూములు ఇవ్వగా.. వాటితో పాటు కొత్త వారికి కూడా భూములు ఇస్తున్నామని వివరించారు. గతంలో ఇచ్చిన వారికి అప్పటి ధరలకే భూములు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక ధరల అంశంలో ఒక పాలసీని తయారు చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. డిసెంబర్ నెలాఖరు నాటికి భూకేటాయింపులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ఈ డిసెంబరు నెలాఖరుకు 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు, మిగతా టవర్ల నిర్మాణాలకు టెండర్లు పూర్తవుతాయని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నుంచి రాజధానిలో పనులు మొదలవుతాయని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com