ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోనసీమ జిల్లా మండపేటలో సిగరెట్ గొడవ ప్రాణం తీసింది. మండపేటలోని గొల్లపుంతలో ఇద్దరు వ్యక్తుల మధ్య సిగరెట్ కోసం గొడవ జరిగింది. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయం కాగా.. మండపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మండపేట గొల్లపుంతకు చెందిన సుందరపు వీరబాబు, వేమగిరి సురేష్ అనే వ్యక్తుల మధ్య సిగరెట్ కోసం వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలోనే వేమగిరి సురేష్.. సుందరపు వీరబాబుపై దాడి చేశాడు. ఈ దాడిలో వీరబాబు తలకు తీవ్రగాయాలు కాగా.. మండపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే మండపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వీరబాబు సోమవారం ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీరబాబు కుటుంబసభ్యుల ఆర్తనాదాలతో ఆస్పత్రి ప్రాంగణం వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మరోవైపు క్షణికావేశంలో జరిగిన ఘర్షణతో నిండుప్రాణం పోవటం స్థానికులను సైతం కలిచివేస్తోంది. అయితే గంజాయి మత్తు కారణంగానే గొడవ జరిగిందని స్థానికులు చెప్తున్నారు. గంజాయి మత్తులోనే సిగరెట్ కోసం గొడవ జరిగిందని.. అదే హత్యకు కారణమైందని స్థానికులు చెప్తున్నారు. గంజాయి స్మగ్లింగ్ మీద పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరోవైపు ఘటన జరిగిన తర్వాత నిందితుడు వేమగిరి సురేష్ అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మండపేట పోలీసులు.. సురేష్ కోసం గాలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ సాయంతో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సురేష్ను అదుపులోకి తీసుకుంటే కానీ.. ఈ హత్య వెనుక ఉన్న కారణాలపై స్పష్టత రాదని పోలీసులు చెప్తున్నారు. సిగరెట్ కోసం జరిగిన గొడవ కారణంగానే క్షణికావేశంలో హత్య జరిగిందా.. లేక.. స్థానికులు ఆరోపిస్తున్నట్లుగా గంజాయి మత్తే దీనికి కారణమా అనే దానిపై క్లారిటీ వస్తుందని పోలీసులు వెల్లడిస్తున్నారు. సురేష్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa