బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్-19 కూచ్ బెహర్ ట్రోఫీలో బిహార్ స్పిన్నర్ సుమన్ కుమార్ చరిత్ర సృష్టించాడు. పట్నా వేదికగా రాజస్థాన్తో జరిగిన మ్యాచులో ఒకే ఇన్నింగ్స్లో పదికి పది వికెట్లు పడగొట్టాడు. దీంతో కూచ్ బెహర్ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్గా అతడు నిలిచాడు. సుమన్ అద్భుత ప్రదర్శన చేసినా.. బిహార్ మాత్రం మ్యాచ్ గెలవలేకపోయింది. రాజస్థాన్ బ్యాటర్లు పోరాడటంతో మ్యాచ్ డ్రా అయింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బిహార్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 467 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ను సుమన్ తన స్పిన్తో ముప్పుతిప్పలు పెట్టాడు. గింగిరాలు తిరుగుతున్న బంతిని అంచనా వేయలేక రాజస్థాన్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో రాజస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 75.5 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్లో 33.5 ఓవర్లు వేసిన సుమన్.. 20 మెయిడెన్లు వేశాడు. 53 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీశాడు.
అయితే తొలి ఇన్నింగ్స్లో 182 పరుగులకే ఆలౌట్ అయిన.. రాజస్థాన్ను బిహార్ ఫాలో ఆన్ ఆడించింది. కానీ రాజస్థాన్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్లో గొప్పగా పోరాడారు. 137.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా కూచ్ బెహర్ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్లు తీసిన మూడో బౌలర్ సుమన్ కుమార్. 2010లో ఆంధ్ర బౌలర్ మెహబూబ్ బాషా, 2018లో మణిపూర్ పేసర్ రెక్స్ రాజ్కుమార్ సింగ్ కూడా పది వికెట్లు పడగొట్టారు.
కాగా ఇటీవల రంజీ ట్రోఫీలోనూ హర్యానా పేసర్ అన్షుల్ కాంబోజ్ పది వికెట్లు తీశాడు. కేరళతో మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో అతడు 49 పరుగులే ఇచ్చి పది వికెట్లు పడగొట్టాడు. రంజీలో ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్గా నిలిచాడు. అంతకుముందు ప్రేమంగ్సు మోహన్ ఛటర్జీ, ప్రదీప్ సుందరం కూడా ఈ ఫీట్ సాధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa