ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది.. మంత్రులుగా పనిచేసినవారు సీనియర్ రాజకీయ నేతలు ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు వైఎస్సార్సీపీకి గుడ్ బై చెబుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి ఇంఛార్జ్ కూడా లేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ జిల్లాలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు.. పార్టీ అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షులతో పాటుగా అవసరమైన చోట్ల నియోజకవర్గాల్లో ఇంఛార్జ్లను మారుస్తున్నారు.
తాజాగా వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.. వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి కుమారుడు ముద్రగడ గిరికి ప్రమోషన్ ఇచ్చారు. గిరికి కీలక బాధ్యతల్ని అప్పగించారు.. ఆయన్ను కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ముద్రగడ గిరిని నియమించారు. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో గిరికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
ముద్రగడ పద్మనాభం గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కీలక నేతగా ఉన్నారు.. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2014-2019 మధ్య కాపు ఉద్యమ నేతగా కీలక బాధ్యతలు నిర్వహించారు.. అనంతరం ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కాపులకు రిజర్వేషన్ల కోసం వరుసగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖలు రాశారు.. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. అయితే 2024 ఎన్నికల సమయంలో ముద్రగడ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావించారు. అయితే జనసేన పార్టీలోకి వెళతారని ప్రచారం జరిగింది.. కానీ ఆ దిశగా అడుగులు పడలేదు.
జనసేన నుంచి ఆహ్వానం రాకపోవడంతో.. కొద్దిరోజుల తర్వాత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్సీపీలో చేరారు.. ఆయన ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. వైఎస్సార్సీపీ అధిష్టానం ముద్రగడకు పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతల్ని అప్పగించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడించకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించడంతో.. ముద్రగడ తన పేరును పద్మనాభం రెడ్డిగా మార్చుకున్న సంగతి తెలిసిందే.
ప్రత్తిపాడు నియోజకవర్గం విషయానికి వస్తే.. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి పోటీచేసిన వరుపుల సుబ్బారావు విజయం సాధించారు.. ఆయన కొంతకాలం తర్వాత వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వరుపుల సుబ్బారావుకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు.. వరుపుల రాజాకు ఛాన్స్ ఇచ్చారు. అయితే వైఎస్సార్సీపీ అభ్యర్థి పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ చేతిలో రాజా ఓడిపోయారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత వరపుల సుబ్బారావు మళ్లీ వైఎస్సార్సీపీలో చేరారు. అయితే 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ను పక్కన పెట్టి వరుపుల సుబ్బారావును పోటీ చేయించగా.. టీడీపీ అభ్యర్థి వరుపుల సత్యప్రభ చేతిలో ఓడిపోయారు. అయితే వరుపుల సుబ్బారావు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉండగా.. ఆయన స్థానంలో తాజాగా ముద్రగడ గిరికి బాధ్యతల్ని అప్పగించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa