ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహూర్తం.. ఈ మార్గంలోనే తొలి రైలు పరుగులు

national |  Suryaa Desk  | Published : Sat, Dec 07, 2024, 08:25 PM

దేశంలో 2019లో ప్రారంభమైన వందే భారత్ రైళ్లు.. ప్రయాణికుల నుంచి ఎంత ఆదరణ పొందుతున్నాయో చూస్తూనే ఉన్నాం. అత్యాధునిక సౌకర్యాలతోపాటు అధిక వేగంతో గమ్యస్థానాలకు చేరుకుంటున్న ఈ వందే భారత్ రైళ్లను.. రైల్వే శాఖ విడతల వారీగా ప్రవేశపెడుతోంది. అయితే ఇప్పటివరకు ఉన్న వందే భారత్ రైళ్లలో స్లీపర్ కోచ్‌లు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ గత కొన్నేళ్లుగా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలు ఎక్కనున్నట్లు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఇక తాజాగా వందే భారత్ స్లీపర్ రైళ్లకు సంబంధించి రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు.


రైల్వే మంత్రిత్వ శాఖ చెప్పిన వివరాల ప్రకారం.. వందే భారత్ స్లీపర్ రైలుకు సంబంధించిన సెట్ మొదటి నమూనా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. దీన్ని త్వరలోనే క్షేత్ర స్థాయిలోకి తీసుకు వచ్చి.. ముందుగా స్లీపర్‌ కోచ్‌లను వందే భారత్‌ రైలుకు జత చేసి కొన్ని ట్రయల్స్ నిర్వహించనున్నారు. ట్రయల్‌ రన్‌ సమయంలో ప్రయాణికులు ఎవరినీ ఈ కోచ్‌లలోకి అనుమతించరు. అయితే ఒకసారి వందే భారత్ స్లీపర్ కోచ్‌ల ట్రయల్‌ రన్‌ సక్సెస్ అయిన తర్వాతే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. అప్పటి నుంచే వందే భారత్ స్లీపర్ రైళ్ల టికెట్ల రిజర్వేషన్‌ ప్రారంభిస్తారు. అయితే వచ్చే ఏడాది జనవరి నుంచి వందే భారత్ స్లీపర్‌ కోచ్‌లు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వందే భారత్ స్లీపర్‌ రైళ్లను సుదూర, మధ్యస్థాయి దూర ప్రయాణాలకు అనుకూలంగా రూపొందించినట్లు రాజ్యసభలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ వందే భారత్ రైళ్లలో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.


 వందే భారత్ స్లీపర్ రైలు సౌకర్యాలు


వందే భారత్ స్లీపర్ రైలులో భద్రత కోసం ఆర్మర్ టెక్నాలజీని ఉపయోగించారు.


ఈ వందే భారత్ స్లీపర్ రైలులో కవచ్ వ్యవస్థను తీసుకువచ్చారు.


ఈ రైలు బోగీలను ఈఎస్-45545 హెచ్ఎల్3 అగ్నిమాపక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించారు.


వందే భారత్ స్లీపర్ రైలు కప్లర్లను అధునాతన టెక్నాలజీతో తయారు చేయడం వల్ల ప్రయాణం కుదుపులు లేకుండా సాగుతుంది.


అత్యాధునికమైన బ్రేకింగ్ సిస్టమ్, రైలు యాక్సిలరేషన్ సమయం కూడా చాలా తక్కువగా ఉంటుంది.


ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే లోకో పైలట్-రైలు మేనేజర్ మధ్య కమ్యూనికేషన్ కోసం టాక్ బ్యాక్ సదుపాయం ఉంది.


ప్రతీ చివర డ్రైవింగ్ కోచ్‌లో పరిమితం చేయబడిన మొబిలిటీ ఉన్న ప్రయాణికులకు వసతి, టాయిలెట్లు.


రైలులో సెంట్రల్ కంట్రోల్‌లో ఉండే ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, విశాలమైన గ్యాంగ్‌ వేలు.


సులభంగా పై బెర్త్‌కు ఎక్కేందుకు నిచ్చెన.


ప్రతి కోచ్‌లో సీసీ కెమెరాలు, ఏసీ, సెలూన్ లైటింగ్.


అయితే వందే భారత్ స్లీపర్ రైలు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అనేది అధికారికంగా రైల్వే శాఖ ఇంకా ప్రకటించలేదు. అయితే వచ్చే ఏడాది జనవరిలో ఢిల్లీ-శ్రీనగర్ మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలు నడుపనున్నట్లు రైల్వే అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 136 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని రాజ్యసభలో అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. వీటిలో ఒక్క తమిళనాడులోనే 16 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయని తెలిపారు. ఢిల్లీ-బనారస్ మధ్య 771 కిలోమీటర్ల సుదీర్ఘ దూరానికి వందే భారత్ రైలు ప్రయాణిస్తోందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa